
హిందూమతంలో సాధువులకు.. పీఠాధిపతులకు.. సత్పురుషులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం.. సత్పురుషుల దర్శనం కలిగితే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సత్పురుషులు అంటే ఎవరు.. వారి దర్శనంతో కలిగే ఉపయోగాలు ఏమిటి.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
ప్రస్తుత కాలంలో సత్పురుషులు అంటే ఏముందిలే.. ఎవరున్నారులే అని కొట్టిపారేస్తారు. అయితే ఎవరిలో ఎంత మేరకు శక్తి ఉందో తెలియదు. ఉదాహరణకు టార్చిలైట్ వెలుగును మనం పూర్తిగా చూడలేము.. అలాంటి సాక్షాత్తు భగవంతుని తేజస్సు.. దైవానుగ్రహం ఉండి.. నిత్యం జపం.. అనుష్ఠానం చేసుకొనే వారి శక్తి గురించి మనకు తెలియదు.. వారి శక్తి గురించి అంచనా వేయలేమని అలాంటివారినే సత్పురుషులు అంటారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ఈరోజుల్లో ఎవరైనా ఒక సత్పురుషులు దర్శన భాగ్యం.. ఎవరైనా ఒక మహానుభావుల సాంగత్యం, కొరకు ప్రయత్నం చేస్తే, వారిని గేలి చేస్తుంటారు. కొందరైతే.. వారికి ఏమీ తెలియదు... అలాంటి వారి దగ్గరకు వెళుతున్నారని.. వెటకారం చేస్తూ ఉంటారు. ఇది కలియుగం కదా..! అందుకే వినాశకాలే విపరీత బుద్ది అన్నారు.
ఏ విషయమైనా తెలియాలంటే.. మనం చూడాలి లేదా అనుభవించాలి... కొన్ని విషయాలు కంటికి కనపడవు.. కాని వాటి శక్తి అంతా ఇంతా కాదు.. ఉదాహరణకు గాలి కనపడదు.. అది లేకపోతే ఏ జీవి అయినా ప్రాణాలతో ఉండదు. గాలి లేదు కదా... ఇదంతా ట్రాష్ అంటామా.. ఈ మాట ఎవరు అనరు కదా...ఇది అంతా కలి మాయ మాత్రమేనని గ్రహించాలి.
మనం ఏదైనా ఒక పని చేసే ముందు, దానిని అనుభవించి చూడాలి లేదా ఏదైనా అనుభవపూర్వకంగా మాట్లాడినపుడే మనకు విమర్శించే హక్కు ఉంటుంది . అలా కాకుండా విమర్శలు లేవనెత్తితే అది అహంకారం అవుతుంది...
ఆదిశంకరాచార్యులు కూడా...
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః ... అంటూ ఉపదేశించారు...
ఒకసారి... అంటే మరికొద్ది రోజుల్లో కలియుగం ప్రారంభం అవుతుందనుకునే రోజుల్లో... నారదమహర్షి సత్సాంగత్య ఫలం గురించి చెప్పమని శ్రీ మహా విష్ణువును అడిగాడు. అదేమిటో అనుభవపూర్వకంగానే చెప్పాలనుకున్నాడు శ్రీ మహా విష్ణువు. ..నారదా! మొదట తూర్పు వైపు వెళ్లి ఒక పశువులశాలలో పేడపురుగును.... పశ్చిమదిశగా వెళ్లి పాడుపడిన దేవాలయంలో పావురాన్ని అడిగి నీ సందేహం తీర్చుకోమని చెప్పాడు విష్ణమూర్తి.
నారదుడు వాటిని అడగ్గానే అవి ఆయన పాదాలమీద పడి ప్రాణాలు విడిచాయట. అప్పుడు నారద మహర్షి చింతిస్తూ శ్రీ మహా విష్ణువుకు ఈ విషయం విన్నవించగా.. అయితే ఈసారి ఉత్తరదిక్కుకు వెళ్లు... అక్కడ సంస్థానంలో రాజుకు బిడ్డ ఈ క్షణమే పుట్టాడు. అతడు నీ సందేహాన్ని తప్పక తీర్చగలడు అని వివరించాడు.
గతంలో నీవు చెప్పింది అంతా ట్రాష్.. ఇప్పుడు మళ్లీ అటు వెళ్లమంటున్నారు.. అని అనకుండా .. మళ్లీ ఏమవుతుందోనని నారదుడు సంకోచించాడు. ఈ విషయాన్ని గ్రహించిన విష్ణుమూర్తి.. సంకోచాలు... సందేహాలు వచ్చినా అలాంటివన్నీ పక్కన పెట్టి ... ఈసారి నిర్భయంగా వెళ్లు! అంతా శుభమే జరుగుతుంది.. నీ ప్రశ్నలకు జవాబు లభిస్తుంది అన్నాడు శ్రీ మహా విష్ణువు.
శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా నారదుడు రాజ మందిరంలో శిశువును ప్రశ్నించిన మరుక్షణం ఆ పసికందు ఒక దేవతగా మారాడు . నారదునికి ప్రణమిల్లి ... దేవర్షీ... అలా ఆశ్చర్యపోతున్నారేమిటి? మీరు చూసిన పేడపురుగును నేనే. మీలాంటి వారి సత్పురుషుల దివ్యదర్శనంతో పావురంగా జన్మించాను. మరోసారి తమరి దర్శనభాగ్యంతో రాకుమారుడిగా జన్మించాను, ఈసారి మీ దర్శనంతో దైవత్వం లభించింది. అని విన్నవించుకున్నారట,
చూశారా..! మహాత్ముల సాంగత్య మహిమ ఇంతటిది... అంటూ దేవలోకానికి వెళ్లిపోయాడట, మహాత్ముల సాంగత్యం అంత గొప్పది... వారి దర్శన, స్పర్శన, సాంగత్యం దొరకాలంటే పూర్వ జన్మ సుకృతం కూడా వుండాలి.
మహాత్ముల గూర్చి తెలుసుకోవడం చాలా కష్టం, విమర్శించడం చాలా సులువు అనే విషయం తెలుసుకోవాలి. మీకు నమ్మకం ఉంటే సత్పురుషులుగా ఉండే వారిని దర్శనం చేసుకోండి... ఒకవేళ నమ్మకం లేదంటే మీరు అలా వదిలేయండి.. కాని విమర్శలు మాత్రం చేయవద్దు... ఎవరిలో ఎంత శక్తి ఉందో.. ఎవరు సత్పురుషులో కూడా కలియుగంలో గుర్తించలేము కదా..! అందుకే ఎవరైనాపెద్దలు.. సన్యాసులు.. సాధువులు తారసపడినప్పుడు ఒక నమస్కారం పెట్టండి.. భగవంతుడు ఏ రూపంలో ఎప్పుడు.. ఎలా కరుణిస్తాడో తెలియదు కదా..!