- పీటీసీ ప్రిన్సిపాల్స్ తో వీడీయో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు : పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్ఐ, కానిస్టేబుల్స్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకున్నదని ఆయన తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్లో శిక్షణ ప్రారంభిస్తామని వెల్లడించారు. ట్రైనింగ్ వింగ్ ఐజీ తరుణ్ జోషితో కలిసి పోలీస్ ట్రైనింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో మంగళవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 14,881 కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని 28 పోలీస్ ట్రైనింగ్ సెంటర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే మహిళా ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మౌలిక సదుపాయాలు,శిక్షణకు కావాల్సిన మెటీరియల్, వసతి సౌకర్యాలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ‘‘రాష్ట్ర పోలీసు అకాడమీలో 653, అంబర్పేట్ పీటీసీలో 650, వరంగల్లో 1000, కరీంనగర్లో 442, మేడ్చల్లో 250 మందికి శిక్షణ ఇస్తం. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ లో 250 మంది చొప్పున ట్రైనింగ్కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం. అలాగే టీఎస్ఎస్పీ యూసుఫ్గూడలో 400, కొండాపూర్లో450, డిచ్పల్లిలో 350, మంచిర్యాలలో 325 మందికి శిక్షణ ఇచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశాం” అని అంజనీ కుమార్ తెలిపారు.