- సీపీలు, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష
హైదరాబాద్, వెలుగు : సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్పై డీజీపీ రవిగుప్తా ఫోకస్ పెట్టారు. పెరిగిపోయే ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. వెంటనే ట్రాఫిక్ నియంత్రణకు ప్రపోజల్స్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ సమస్యలపై మంగళవారం సమీక్షించారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు దిశానిర్దేశం చేశారు. డీజీపీ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా ట్రాఫిక్ను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మూసీ నదిపై వంతెనల పరిస్థితులు, ట్రాఫిక్పై ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సిబ్బందికి ట్రైనింగ్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులపై సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాహనాల సంఖ్య, రోడ్ల విస్తీర్ణం, ఫుట్పాత్ల ఆక్రమణలు, ఫ్రీ లెఫ్ట్లు, యూ టర్న్లు, రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై వాహనాలు పార్కింగ్ ఏరియాలు, కొత్త స్కై వాక్లు,ఫ్లైఓవర్లు చుట్టూ ట్రాఫిక్ పరిస్థితులను వివరిస్తూ ప్రజెంటేషన్ను డీజీపీకి వివరించారు.
ట్రాఫిక్ పోలీసులు అందించే ప్రపోజల్ ఆధారంగా యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ బి. శివధర్రెడ్డి, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, సైబరాబాద్ సీపీ అవినాశ్మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.