- సీఎస్బీ, టీఎఫ్సీసీ మధ్య అవగాహన ఒప్పందం
- పైరసీ.. ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్గా మారింది: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సినిమా పైరసీ, ఆన్లైన్ కాపీరైట్ ఉల్లంఘనలు ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్స్గా మారాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పైరసీని నివారించేందుకు పోలీసులతో పాటు సినీ ఇండస్ట్రీ సమన్వయం తప్పనిసరి అని సూచించారు. పైరసీని అరికట్టేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ), తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
ఎంవోయూపై తెలంగాణ పోలీస్ తరఫున టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, సినీ పరిశ్రమ తరఫున టీఎఫ్సీసీ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్ బాబు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి డీజీపీ బి.శివధర్ రెడ్డి హాజరయ్యారు. సినిమాల పైరసీపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్రెడ్డి పలు సూచనలు చేశారు. దర్యాప్తు సంస్థలు, సినీ పరిశ్రమ కలిసి పైరసీని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడారు.
కొన్ని నిమిషాల ఆలస్యం.. నిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఎంవోయూ వేగవంతమైన చర్యలకు దోహదపడుతుందని అన్నారు. టీఎఫ్సీసీ అధ్యక్షుడు సురేశ్ బాబు మాట్లాడారు. తమిళ్ బ్లాస్టర్స్, ఐబొమ్మ వంటి పెద్ద పైరసీ నెట్వర్క్లపై తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యలు పరిశ్రమకు బలమైన మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు.
రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్తో అడ్డుకట్ట!
డిజిటల్ పైరసీ అత్యంత సున్నితమైన సమస్య అని, కాపీరైట్ ఉల్లంఘనలకు రియల్ టైమ్లో గుర్తించడం ద్వారా మాత్రమే నిర్మాతల నష్టాలను నియంత్రించగలమని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ చైర్మన్ రాజ్కుమార్ ఆకెళ్ల అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు, అన్నపూర్ణ స్టూడియోస్ ఈడీ సుప్రియ యార్లగడ్డ సహా టీజీసీఎస్బీ, తెలుగుఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కాగా, సినిమా విడుదలైన కొద్ది నిమిషాల్లోనే వెబ్సైట్లు, సోషల్ మీడియా, మెసేజింగ్ గ్రూపులు, ఐపిటీవీ స్ట్రీమ్స్, మొబైల్ యాప్లు, క్యామ్కార్డింగ్ ద్వారా జరుగుతున్న ఆర్గనైజ్డ్ డిజిటల్ పైరసీని అరికట్టేందుకు ఈ ఎంవోయూ లైన్ క్లియర్ చేస్తుంది. రియల్టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్, వేగవంతమైన టేక్డౌన్ చర్యలు, చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన విధానాన్ని ఇది ఏర్పరుస్తుంది.
ఈ ఒప్పందం ప్రకారం, పైరసీ నెట్వర్క్లపై ప్రత్యక్ష పర్యవేక్షణ, టీజీసీఎస్బీ ఐసీసీసీ కేంద్రంలో టీఎఫ్సీసీ యాంటీ పైరసీ ఏజెంట్ల నియామకం, ధృవీకరించిన ఫిర్యాదులపై తక్షణ చట్టపరమైన చర్యలు, ఓటీటీలు, సోషల్ మీడియా సంస్థలతో సమన్వయం ద్వారా పైరేటెడ్ కంటెంట్ తొలగింపు వంటి చర్యలు చేపట్టనున్నారు. అలాగే ఆధునిక సాంకేతిక సాధనాలు వినియోగించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చర్చించారు.
