
రఘువరన్ బీటెక్, సార్ లాంటి చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్న ధనుష్.. అప్పుడప్పుడూ బాలీవుడ్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే అక్కడ మూడు సినిమాల్లో నటించిన ధనుష్.. తాజాగా మరో మూవీకి కమిట్ అయ్యాడు. ధనుష్తో రాంజానా, ఆత్రంగీ రే సినిమాలను తీసిన ఆనంద్ ఎల్.రాయ్.. ఈ కొత్త చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనికి ‘తేరే ఇష్క్ మే’ అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో గడ్డంతో మాస్ లుక్లో కనిపించాడు ధనుష్. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 2013లో వచ్చిన ‘రాంజానా’తో ధనుష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై బుధవారంతో పదేళ్లు పూర్తయిన సందర్భంగా ధనుష్, ఆనంద్ కాంబినేషన్లో మూడో సినిమాను అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం అరుణ్ మతేశ్వరణ్ దర్శకత్వం వహిస్తున్న ‘కేప్టెన్ మిల్లర్’ అనే చిత్రంలో ధనుష్ నటిస్తున్నాడు.