ధరణి డ్రైవ్​ కంటిన్యూ... లక్షా 10 వేల పెండింగ్​సమస్యలకు పరిష్కారం

ధరణి డ్రైవ్​ కంటిన్యూ...  లక్షా 10 వేల పెండింగ్​సమస్యలకు పరిష్కారం

హైదరాబాద్​, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్​ కంటిన్యూ కానున్నది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ధరణి స్పెషల్​ డ్రైవ్ షెడ్యూల్​ ప్రకారం​ శనివారంతో ముగియాలి. అయితే ఇంకా సమస్యలు అలాగే ఉండటం, వరుస సెలవులు రావడంతో పెండింగ్​ అప్లికేషన్లన్నీ క్లియర్​ చేసేంత వరకు డ్రైవ్​ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధరణిలో మొత్తం 2.45 లక్షల దరఖాస్తులు  పెండింగ్​లో ఉండగా.. అందులో లక్షా 10 వేల అప్లికేషన్లకు సంబంధించి క్లియరెన్స్​ ఇచ్చారు. మరో లక్షా 35 వేల అప్లికేషన్లు  ప్రాసెస్​లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి రివ్యూలో ధరణిపై ఏర్పాటైన కమిటీ  పలు కీలక సూచనలు చేసింది. దాంట్లో భాగంగానే ధరణి స్పెషల్​ డ్రైవ్​తోపాటు వివిధ స్థాయిల్లో అధికారాల వికేంద్రీకరణ చేపట్టాలని సూచన చేసింది. దీంతో ఇప్పుడు ధరణి పోర్టల్ సాఫ్ట్​వేర్​లో పలు మార్పులు చేస్తున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవో, అడిషనల్​ కలెక్టర్​ (రెవెన్యూ), కలెక్టర్​, సీసీఎల్ఏ లాగిన్లను మారుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం కలెక్టర్​కు, సీసీఎల్​ఏకు​ మాత్రమే ధరణిలో ఏదైనా భూమిలో మార్పులు చేసేందుకు అవకాశం ఉన్నది. ఇప్పుడు లాగిన్​లు కింది స్థాయిలోనే ఇవ్వడంతో ఇక మీదట ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, కలెక్టర్లు రిపోర్టులు రెడీ చేసి సీసీఎల్​ఏ​ వరకు పంపాల్సిన అవసరం లేకుండా క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కరించే వీలు కలుగనున్నది. 

ఎమ్మార్వో లెవెల్​లో లాగిన్ ఇవ్వడం ద్వారా  టీఎం4–విరాసత్ (అసైన్డ్ భూములతో సహా), టీఎం10– జీపీఏ, ఎస్పీఏ, టీఎం14– స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్, టీఎం 32–ఖాతా మెర్జింగ్ వంటివి ఎమ్మార్వో స్థాయిలోనే అయిపోనున్నాయి. వీటిని ఏడు రోజుల్లోగా పరిష్కరించనున్నారు. ఆర్డీవో లెవెల్ లో టీఎం 7–పాసు పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్,  టీఎం 16–ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, టీఎం 20–ఎన్ఆర్ఐ లకు సంబంధించిన సమస్యలు, టీఎం 22–సంస్థలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, టీఎం 26–కోర్టు కేసులు, సమాచారం,

 టీఎం 33– డేటా కరెక్షన్స్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ మిస్సింగ్స్ (ఎకరం రూ.5 లక్షల లోపు ఉన్న ఏరియాల్లో మాత్రమే) లాంటివి పరిష్కారం కానున్నాయి. కాగా, ఆర్డీవో తనకు అప్పగించిన మాడ్యూళ్ల దరఖాస్తులను మూడ్రోజుల్లోగా పరిష్కరిస్తారు.  ఇక సీసీఎల్ఏకు వెళ్లే అప్లికేషన్లలో టీఎం 33 కింద డేటా కరెక్షన్, నోషనల్ ఖాతా ట్రాన్స్​ఫర్, క్లాసిఫికేషన్ మార్పు, రూ.50 లక్షలకు పైగా విలువజేసే భూముల్లో డేటా కరెక్షన్ వంటివి ఉండనున్నాయి.