- బీజేపీ ఎంపీ అర్వింద్ డిమాండ్
- కేసీఆర్ కొడుకుగా మాత్రమే కేటీఆర్కు అర్హత
- అన్న మొహం చూడడం ఇష్టంలేకే నిజామాబాద్ సభకు కవిత పోలే
న్యూఢిల్లీ, వెలుగు: సీఎం కేసీఆర్కు దమ్ముంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ విసిరారు. కేసీఆర్ పోటీ చేసేలా కేటీఆర్ చొరవ తీసుకోవాలని, అప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూపిస్తానన్నారు. ఒకవేళ ఓడిపోతే కనీసం కుటుంబంలో గౌరవం కూడా దక్కదన్న విషయం మర్చిపోవద్దన్నారు. గురువారం ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో మీడియాతో అర్వింద్ మాట్లాడారు. కేసీఆర్ కొడుకుగా మాత్రమే కేటీఆర్కు అర్హత ఉందన్నారు. నిజామాబాద్ సభకు రాలేదని తనను అడుగుతున్న కేటీఆర్.. కల్వకుంట్ల కవిత ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభలో విప్ కారణంగా నిజామాబాద్ సభకు వెళ్లలేదని అర్వింద్ క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ఏడాదికి 4 నెలలు నడుస్తాయని, కేసీఆర్ లాగా నాలుగు రోజులు నడిపే అసెంబ్లీ సమావేశాలు కావన్నారు. అయితే, కవిత మాత్రం అన్న కేటీఆర్ మొహం చూడటం ఇష్టం లేకే ఆ ప్రొగ్రాంకు వెళ్లలేదని ఆరోపించారు.
గృహలక్ష్మి స్కీమ్కు మూడ్రోజులేనా..?
మద్యం టెండర్కి 15 రోజుల సమయం ఇచ్చిన ప్రభుత్వం.. గృహలక్ష్మి స్కీమ్కు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం 3 రోజుల సమయం ఇస్తారా? అని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కీమ్కు ప్రభుత్వం డబ్బులు కేటాయించలేదని తాను నిరూపిస్తానని, ఫండ్స్ రిలీజ్ చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నారు. 2014 నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్, కేటీఆర్లను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరన్నారు. 25 వేల చదరపు అడుగుల్లో ఐటీ హబ్ కట్టడానికి కేటీఆర్కు ఐదేండ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. అందులో కేవలం 280 మందికి జాబ్స్ ఇస్తే, చాలా మంది కాల్ సెంటర్ జాబ్స్ వద్దని వెళ్లిపోయారని చెప్పారు.