శామీర్ పేట వెలుగు: శామీర్ పేట మండలం తూముకుంట మున్సిపాలిటీ ఉప్పరపల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వం పట్టాలిచ్చిన భూములను కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని దీన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ఆదివారం నిరసన చేపట్టారు. స్థానికులు మాట్లాడుతూ.. ఉప్పరపల్లి గ్రామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుకు ఆనుకుని 16 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఉప్పరపల్లికి చెందిన ఇల్లు లేని స్థానిక పేదలకు 2001లో టీడీపీ ప్రభుత్వం 80 గజాల చొప్పున ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చింది.
ప్రభుత్వ సర్వే నంబర్ 837, 838 భూముల్లో శనివారం రాత్రి 300 మంది 100 గుడిసెలు వేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉప్పరపల్లి గ్రామస్తులు ఆదివారం రాజీవ్ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. మంత్రి కొడుకు మహేందర్ రెడ్డి కారులో రావడంతో వాహనాన్ని చుట్టుముట్టిన స్థానికులు ‘ మీ తండ్రి న్యాయం చేయ డం లేదు.. మీరైనా న్యాయం చేయాలి’ అని వాహనాన్ని అడ్డుకుని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.