న్యూఢిల్లీ: రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ వల్ల ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడితే.. మాజీ కెప్టెన్ ఎం.ఎస్ . ధోనీ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ ను తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న ఇది. మహీ ఐపీఎల్ లో సత్తా చాటితేనే టీమిండియాలోకి రీ ఎంట్రీ ఉంటుందని గతంలోనే టీమ్ మేనేజ్ మెంట్, చీఫ్ కోచ్ రవిశాస్త్రి, పాత సెలెక్షన్ కమిటీ స్పష్టంగా చెప్పేసింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ జరిగే చాన్సెస్ చాలా తక్కువ. దీనికి తోడు వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇలాంటి స్థితిలో ఎంఎస్ ను టీ20 వరల్డ్ కప్ టీమ్ కు ఎంపిక చేస్తారా? లేక ఇంటికి సాగనంపుతారా? ఇదే విషయాన్ని మాజీ బ్యాట్స్ మన్ ఆకాశ్ చోప్రాను అడిగితే చాలా స్పష్టమైన జవాబు చెప్పాడు. ‘ధోనీలాంటి క్రికెటర్ కు ఐపీఎల్ కీలకం కానేకాదు. అందులో బాగా ఆడితేనే టీమ్లోకి ఎంపిక చేస్తారని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.
కానీ అది సరికాదు. ఎందుకంటే తాను ఏం చేస్తున్నాడో మహీకి చాలా స్పష్టత ఉంటుంది. టీమ్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలా వద్దా అనే విషయం అతడికే తెలుసు. ఒకవేళ అతను టీమ్లోకి రావాలనుకుంటే ఐపీఎల్ వారధి కానే కాదు. పునరాగమనం చేయాలనుకుంటే అతను కచ్చితంగా సెలెక్టర్లకు అందుబాటులోకి వస్తాడు. సెలెక్టర్లు కూడా అటోమెటిక్గా ఎంపిక చేస్తారు. ఎందుకంటే మహీ అనుభవాన్ని ఎవరూ వదులుకోరు’ అని చోప్రా వ్ యాఖ్యానించాడు. టీమిండియా మహీని కోరుకుంటే ఐపీఎల్ ఆడినా, ఆడకపోయినా కచ్చితంగా టీమ్లోకి వస్తాడన్నాడు.