ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ మళ్లీ సెంచరీ

ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ మళ్లీ సెంచరీ

బెంగళూరు: సౌతాఫ్రికా–ఎతో జరుగుతున్న అనధికార రెండో టెస్ట్‌‌‌‌లో ధ్రువ్ జురెల్‌‌‌‌ (170 బాల్స్‌‌‌‌లో 15 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 127 నాటౌట్‌‌‌‌) వరుసగా రెండో సెంచరీతో చెలరేగాడు. హర్ష్‌‌‌‌ దూబే (84), కెప్టెన్‌‌‌‌ రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (65) కూడా మెరవడంతో.. 78/3 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో శనివారం మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా–ఎ రెండో ఇన్నింగ్స్‌‌‌‌ను 89.2 ఓవర్లలో 382/7 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌ చేసింది. ఫలితంగా సఫారీల ముందు 471 రన్స్‌‌‌‌ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ బ్యాటర్లు కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (27), కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (16) తొందరగానే వెనుదిరిగినా.. జురెల్‌‌‌‌,  దూబే ఆరో వికెట్‌‌‌‌కు 184 రన్స్‌‌‌‌ జత చేశారు. మధ్యలో రిటైర్డ్‌‌‌‌ హర్ట్‌‌‌‌ అయిన పంత్‌‌‌‌ మళ్లీ బ్యాటింగ్‌‌‌‌కు దిగి జురెల్‌‌‌‌తో ఏడో వికెట్‌‌‌‌కు 82 రన్స్‌‌‌‌ జోడించాడు. 

ఒకుహ్లే సెలె 3 వికెట్లు తీశాడు. తర్వాత 471 రన్స్‌‌‌‌ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆట ముగిసే టైమ్‌‌‌‌కు రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 11 ఓవర్లలో 25/0 స్కోరు చేసింది. జోర్డాన్‌‌‌‌ హెర్మాన్‌‌‌‌ (15 బ్యాటింగ్‌‌‌‌), లెసెగో సెనోక్వానే (9 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా ఇంకా 392 రన్స్‌‌‌‌ చేయాల్సి ఉండగా, చేతిలో పది వికెట్లు ఉన్నాయి. మరోవైపు మూడో రోజు బ్యాటింగ్‌‌‌‌ చేసే క్రమంలో పేసర్‌‌‌‌ షెపో మొరాకి బౌలింగ్‌‌‌‌లో పంత్‌‌‌‌ మూడుసార్లు గాయపడ్డాడు. రివర్స్‌‌‌‌ స్వింగ్‌‌‌‌ను ఫుల్‌‌‌‌ చేయబోయి హెల్మెట్‌‌‌‌పై బాల్‌‌‌‌ బలంగా తాకింది. ముందు జాగ్రత్తగా రిటైర్డ్‌‌‌‌హర్ట్‌‌‌‌ అయ్యాడు. ఆ తర్వాత సాంప్రదాయమైన ఫుల్‌‌‌‌ షాట్‌‌‌‌ ఆడినప్పుడు మోచేయికి, మరోసారి పొట్ట ప్రాంతంలో బంతి తగిలి నొప్పితో బాధపడ్డాడు. ఈ మూడుసార్లు వైద్య చికిత్స తీసుకున్నాడు. చివరికు మళ్లీ బరిలోకి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.