
హైదరాబాద్, వెలుగు: బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందా.. లేదా.. సమాధానం చెప్పాలని కేటీఆర్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్లో చేరే ముందు ఇదే విషయాన్ని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్కి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్లిందని ధ్వజమెత్తారు. శనివారం గాంధీ భవన్లో సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడనే తప్పుడు ప్రచారం మరోసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేటీఆర్ను హెచ్చరించారు.
పీఎంగా రాహుల్ను చూడాలని ఒక నిబద్ధతో కాంగ్రెస్ కోసం పని చేస్తున్న రేవంత్పై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. డ్రగ్స్ విషయంలో రేవంత్ సవాలు విసిరి గన్ పార్క్కు వస్తే.. కేటీఆర్ పత్తా లేకుండా పారిపోయారని విమర్శించారు. ఈ విషయంలో కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్కి సిద్ధంగా ఉంటే తాము ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్లో నిజాలు బయటపడుతుంటే, ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. భార్య భర్తలు మాట్లాడుకున్న మాటలు, జడ్జిల ఫోన్లు కూడా కేటీఆర్ విన్నారని, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నికలకు 8 నెలల ముందే రేవంత్కు చెప్పానన్నారు.
కేటీఆర్ అభినవ గోబెల్స్: మహేందర్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినవ గోబెల్స్లా మారారని కేకే మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్లో చేరాలని తనపై కేటీఆర్ ఒత్తిడి చేశారన్నారు. తన ఫోన్ ట్యాప్ అయిందని కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్కు పూనకం వచ్చిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం తాను కేటీఆర్పై ఫిర్యాదు చేస్తే పరువునష్టం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇంకా అధికారంలోనే ఉన్నానని ఆయన అనుకుంటున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తనను బెదిరిస్తున్నారని మరో ఫిర్యాదు చేస్తానని తెలిపారు.