కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్లో విభేదాలు

 కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్లో విభేదాలు
  • చక్రం తిప్పుతున్న పలువురు కౌన్సిలర్లు

భద్రాద్రికొత్తగూడెం,వెలుగు:జిల్లాలోని కొత్తగూడెం,ఇల్లెందు మున్సిపాలిటీలలో అవిశ్వాసం టెన్షన్​ నెలకొంది. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలలో టీఆర్​ఎస్​ పాలకవర్గాలున్నాయి. ఈ టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు రోజు రోజుకూ రచ్చకెక్కుతున్నాయి. ఇందులో భాగంగానే ఆయా మున్సిపాలిటీల చైర్మన్లను గద్దె దించేందుకు అధికార పార్టీ కౌన్సిలర్లే పావులు కదుపుతున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్ పర్సన్​ కాపుసీతాలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు టీఆర్​ఎస్​ పార్టీలోని పలువురు కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జనవరిలో అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్​ చేస్తున్నారు. 

అవిశ్వాసానికి స్కెచ్​.. 

జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలున్నాయి. పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగలేదు. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్​ఎస్​ అత్యధిక స్థానాలను గెలుచుకొని పాలకవర్గాలను ఏర్పాటు చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్మన్​ ఎన్నిక అయినప్పటి నుంచీ   టీఆర్​ఎస్​ లో కౌన్సిలర్లలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి  జనవరితో పాలకవర్గాలకు మూడేండ్లు ముగియనుండడంతో ఆవిశ్వాసానికి అధికార పార్టీలోని పలువురు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. 

చైర్​ పర్సన్​ కె. సీతాలక్ష్మి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆమెకు వ్యతిరేకంగా కౌన్సిల్​ మీటింగ్​లలో అధికార పార్టీ కౌన్సిలర్లే ప్రతిపక్ష పాత్ర పోషించిన సందర్భాలున్నాయి.  ఈ క్రమంలోనే సోమవారం బూడిదగడ్డ ఏరియాలో 11 మంది టీఆర్​ఎస్​ కౌన్సిలర్లు రహస్య మీటింగ్​ నిర్వహించారు. జనవరిలో అవిశ్వాసం పెట్టే విషయంపై చర్చించారు. 

అవిశ్వానికి సీపీఐ కౌన్సిలర్ల మద్దతు కోరేందుకు ఆ పార్టీ జిల్లా సెక్రటరినీ కలిశారు.   కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐకి  ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు.  పార్టీలోని పెద్దల నుంచి తమకు ఆశీస్సులున్నాయని ఆవిశ్వాసంలో విజయం సాధిస్తామంటూ చైర్​ పర్సన్​ వ్యతిరేక వర్గీయులు పేర్కొనడం గమనార్హం. ఏ విషయంలోనూ తమతో చైర్​ పర్సన్​ కలిసిరారని, ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం, కేవలం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కొడుకు వనమా రాఘవ మాటలకే చైర్​ పర్సన్​ ప్రధాన్యం ఇస్తూ మిగిలిన కౌన్సిలర్లను చులకనగా చూస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. 

ఇదిలా ఉండగా ఇల్లెందు మున్సిపాలిటీలో చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్​రావుకు వ్యతిరేకంగా వైస్​ చైర్మన్​ జానీ పాషా పావులు కదుపుతున్నారు. ఆవిశ్వాసం పెట్టేందుకు అధికార టీఆర్​ఎస్​ పార్టీలోని కౌన్సిలర్లతో గత కొంత కాలంగా మంతనాలు సాగిస్తున్నారు. టీఆర్​ఎస్​ పార్టీలోని మున్సిపాలిటీ కౌన్సిలర్లలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, భానోత్​ హరిప్రియతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో వర్గ విభేదాలను ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధ్యక్షులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.