పెంపుడు కుక్కను కొట్టొద్దన్నందుకే చంపేశాడు

పెంపుడు కుక్కను కొట్టొద్దన్నందుకే చంపేశాడు

ఉజ్జయిని: మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. పెట్ డాగ్ ను కొట్టొద్దని అన్నందుకు భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడో ఉన్మాది. అనంతరం ఆ ఉన్మాది కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సైకోగా మారిన తండ్రి బారి నుంచి తప్పించుకునేందుకు మరో ఇద్దరు పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ఉజ్జయిని జిల్లాలోని బాద్ నగర్ ఏరియాలో దిలీప్ పవార్ (45) కుటుంబం ఉంటోంది. ఆయనకు భార్య గంగ (40), బిడ్డ నేహ (17), కొడుకు యోగేంద్ర (14), మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. దిలీప్ కు సరకు రవాణా వెహికల్ ఉంది. 

అయితే కొన్ని రోజులుగా తాగుడుకు బానిసైన దిలీప్.. పనికి వెళ్లడం లేదు. తన వెహికల్ ను కూడా అమ్మేశాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంట్లోని పెట్ డాగ్ ను దిలీప్ కొట్టడం ప్రారంభించాడు. ఇంట్లో వాళ్లు వద్దని వారించారు. దీంతో కోపానికి వచ్చిన దిలీప్.. భార్య గంగ, బిడ్డ నేహ, కొడుకు యోగేంద్రను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఇద్దరు పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికుల సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున 5గంటలకు స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ‘‘దిలీప్ పవార్ తాగుడుకు బానిసయ్యాడని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఘటన జరిగిన టైమ్ లో తాగి ఉన్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది” అని పోలీసులు తెలిపారు.