సినిమా హీరోను చేస్తానని.. 3.50 కోట్లు వసూలు..డైరెక్టర్ అశోక్బాబు, అతని భార్యపై కేసు

సినిమా హీరోను చేస్తానని.. 3.50 కోట్లు వసూలు..డైరెక్టర్ అశోక్బాబు, అతని భార్యపై కేసు
  •     షూటింగ్​ చేయకుండా, డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులు
  •     చీటింగ్​ కేసు నమోదు చేసిన సైబరాబాద్​ ఈఓడబ్ల్యూ పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: ఓ యువకుడిని సినిమా హీరోగా పరిచయం చేస్తానని అతని తండ్రి వద్ద రూ. 3.50 కోట్లు వసూలు చేసి.. చీటింగ్ చేసిన డైరెక్టర్​ గుడ్లూరి అశోక్​బాబు, అతని భార్య విజయలక్ష్మిపై సైబారాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్​పల్లి భాగ్యనగర్​కాలనీకి చెందిన నాయుడు హనమంతరావు బిజినెస్​ చేస్తుంటాడు. హనమంతరావుకు నయీం అనే వ్యక్తి ద్వారా పిల్ల జమిందార్, భాగమతి, ఆకాశరామన్న సినిమాలు డైరెక్ట్​ చేసిన డైరెక్టర్​ అశోక్​బాబు, అతని భార్య విజయలక్ష్మి పరిచయం అయ్యారు. తాము ఒక సినిమా తీస్తున్నామని, అందులో మీ కుమారుడిని హిరోగా పరిచయం చేస్తామని చెప్పారు. అంతే కాకుండా సినీ పరిశ్రమలో మరిన్నీ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 

సినిమా బడ్జెట్​ రూ.8 కోట్లు అవుతుందని, ఆరు నెలల్లో లాభాలతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వీరి మాటలు నమ్మిన హనమంతరావు.. డైరెక్టర్ అశోక్​బాబుకు 2024 సెప్టెంబర్​ 3వ తేదీ నుంచి 2025 డిసెంబర్​ 2వ తేది వరకు దశల వారీగా రూ.3.05 కోట్ల డబ్బు ట్రాన్స్​ఫర్​ చేశాడు. ఆ తర్వాత మరో రూ. 45 లక్షల చెక్​ను కూడా ఇచ్చాడు. 2024లో హనమంతరావు కొడుకు హిరోగా డైరెక్టర్​ అశోక్​బాబు సినిమా షూటింగ్​ప్రారంభించారు. అయితే సినిమా షూటింగ్​ పూర్తి చేయకుండా డబ్బు మొత్తం అశోక్​బాబు తన వద్ద పెట్టుకున్నాడు. సినిమా షూటింగ్​ పూర్తి చేయాలని, లేదంటే డబ్బులు తిరిగి ఇవ్వాలని హనమంతరావు డిమాండ్​ చేయడంతో డైరెక్టర్​ అశోక్​బాబు రూ. 4.50 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చి రూ. 50 లక్షల విలువైన నాలుగు చెక్కులు ఇచ్చాడు.

గడువు ముగిసిన డబ్బులు ఇవ్వకపోవడంతో డైరెక్టర్​ అశోక్​బాబును  హనమంతరావు నిలదీయగా.. నీ కుమారుడికి ఫ్యూచర్​ లేకుండా చేస్తామని, డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. సినిమా షూటింగ్​ పూర్తి చేయకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకుండా డైరెక్టర్​ బెదిరింపులకు గురిచేయడంతో హనమంతరావు 2025 మే 8వ తేదీన కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న కూకట్​పల్లి పోలీసులు ఈఓడబ్ల్యూకు ట్రాన్స్​ఫర్​ చేశారు. జూన్​ 10న సైబరాబాద్​ ఈఓడబ్ల్యూ పోలీసులు డైరెక్టర్​ అశోక్​బాబు అతని భార్య విజయలక్ష్మి, మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.