కారు ముట్టుకున్నరని గుద్ది చంపిండు

కారు ముట్టుకున్నరని గుద్ది చంపిండు
  •    చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్ లీడర్ కొడుకు దారుణం
  •     నాలుగేళ్ల చిన్నారి మృతి.. 12 మంది గాయాలు

రాయిపూర్: దసరా పండుగ… ఊరంతా ఒక చోట గుమిగూడి సంబురంగా జరుపుకున్నరు.. వేడుకలయ్యాక అందరూ ఇండ్లకు బయల్దేరారు. దారిలో ఓ కారు ఉంది.. దాని పక్క నుంచే అందరూ ముందుకు సాగారు. కానీ అనుకోకుండా ఒకరు ఆ కారును ముట్టుకున్నరు. అంతే.. కారులో ఉన్నోళ్లు ఒక్కసారిగా ఊరోళ్ల మీదికొచ్చారు. ‘మా కారునే టచ్ చేస్తరా?’ అంటూ గ్రామస్తులతో గొడవ పడ్డారు. వాళ్లకు వార్నింగ్ ఇచ్చి కారు స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్లారు. వెంటనే రివర్స్​లో వచ్చి జనాల మీదికి ఎక్కించారు. దీంతో చక్రాల కింద పడి నాలుగేళ్ల పిల్లాడు చనిపోయాడు. మరో 12 మంది గాయపడ్డారు. చత్తీస్​గఢ్​లోని గరియాబండ్ జిల్లా మల్గావ్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగిందీ ఘటన. పరారైన నిందితులు దగ్గర్లోని అడవిలో దాక్కున్నారు. ప్రధాన నిందితుడు రోమిత్ రాథోడ్, అతడి ఫ్రెండ్ సౌరభ్ కుటారెను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రోమిత్ మాజీ మేయర్, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మమతా రాథోడ్ కొడుకు అని చెప్పారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు.  గ్రామస్తులు  రోడ్డుపై బైఠాయించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.