
- బుకింగ్స్ ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే
సికింద్రాబాద్, వెలుగు: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఈ నెల 23న జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్రను చేపట్టింది. ఈ యాత్ర సికింద్రాబాద్ లో మొదలై.. తమిళనాడు , కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల నుంచి రామేశ్వరం జ్యోతిర్లింగ దర్శనం వరకు కొనసాగనుంది.
అదే సమయంలో అరుణాచలంలోని తిరువణ్ణామలై , మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులను కవర్ చేస్తూ వెళ్తుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీలోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ లలో ప్రయాణికులు ఎక్కి, దిగే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
ఈ యాత్ర మొత్తం 9 రోజులు (ఈ నెల 23 నుంచి 31 వరకు) కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ http://www.irctctourism.com ను సందర్శించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని, గొప్ప సాంస్కృతిక, వారసత్వ, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను చూపే అవకాశం కల్పిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.