
- మూడేండ్ల కింద ఆర్థిక సమస్యలతో ఉరేసుకుని భార్య సూసైడ్
- దంపతుల మృతితో అనాథలైన ఇద్దరు ఆడపిల్లలు
- రైతు డెడ్బాడీతో భూ నిర్వాసితుల ఆందోళన
- సిద్దిపేట జిల్లా నరసన్నపేట గ్రామంలో ఘటన
ములుగు, వెలుగు: ట్రిపుల్ ఆర్ లో తన భూమి పోతుండగా, పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని తీవ్ర మనస్తాపానికి లోనైన దివ్యాంగ రైతు గుండెపోటుతో చనిపోయాడు. మూడేండ్ల కింద తల్లి, ఇప్పుడు తండ్రి మృతితో ఇద్దరు ఆడ పిల్లలు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామానికి చెందిన ఎంబారి భిక్షపతి(42) దివ్యాంగుడు. తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసు కుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అతని భార్య అనసూయ మూడేండ్ల కింద ఆర్థిక సమస్యలతో ఉరేసుకుని చనిపోయింది. వీరి పెద్ద కూతురు నిత్య ఆరో తరగతి, చిన్న కూతురు రితిక నాలుగో తరగతి చదువుతున్నారు. రీజినల్రింగు రోడ్డులో భూమి పోతుండగా నాలుగు రోజుల కింద రెవెన్యూ అధికారులు భిక్షపతికి నోటీసు పంపారు.
ప్రస్తుతం మార్కెట్ లో భూమికి రూ.కోటి ధర ఉంది. కానీ.. రూ.7. 40 లక్షల పరిహారం మాత్ర మే ఇస్తామని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. దీంతో తన పిల్లల భవిష్యత్ ఏంటోనని భిక్షపతి నోటీసు వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి హార్ట్ స్ట్రోక్తో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ట్రిపుల్ ఆర్ భూ బాధిత రైతులు, గ్రామస్తులు భిక్షపతి డెడ్ బాడీతో మంగళవారం ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ప్రవీణ్రెడ్డి, పోలీసులు వెళ్లి మాట్లాడారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.