బీజేపీని తలవనిదే కేసీఆర్ కు నిద్రపట్టడం లేదు

బీజేపీని తలవనిదే కేసీఆర్ కు నిద్రపట్టడం లేదు

బీజేపీ పేరు తలవనిదే కేసీఆర్ కు నిద్ర రాని పరిస్థితి నెలకొందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అందుకే బీజేపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గొంతు చించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచ ఝూటా అవార్డ్ అంటూ ఉంటే.. దాన్ని సీఎం కేసీఆర్ కే ఇవ్వాలని చెప్పారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని తెలిపారు. ‘‘మా ఎమ్మెల్యేలను 3 తోకలు అంటావా? నీకు దమ్ము, ధైర్యం ఉంటే... మా ముగ్గురు ఎమ్మెల్యేలను ఎందుకు అసెంబ్లీ నుంచి బయటికి పంపించావ్. కేసీఆర్ చెప్పేవన్నీ ఝూటా మాటలే’’ అని అరుణ వ్యాఖ్యానించారు.  ‘‘సీఎం కేసీఆర్.. ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ కరెంట్ మీటర్లు అంటాడు. దుబ్బాక, హుజూరాబాద్ ఎలక్షన్స్ లో ప్రజలు బుద్ది చెప్పినా.. కేసీఆర్ కు సిగ్గు రాలేదు.

ప్రజలు బీజేపీ కి ఓటు వేసి, కేసీఆర్ కే మీటర్లు పెట్టారు. ప్రజలను మోసం చేస్తూ... కేసీఆర్ పబ్బం గడుపుతున్నాడు’’ అని తెలిపారు. కేసీఆర్ తన సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, జాతీయ పార్టీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు. ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్... తెలంగాణ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ నియంత పాలనను బీజేపీ అంతం చేస్తుందన్నారు.  ‘భారత్ జోడో కాదు.. ముందు రాహుల్ గాంధీ తన పార్టీ ని జోడో చేసుకోవాలి’ అని డీకే అరుణ హితవు పలికారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు పార్టీ అభ్యర్థిని ఎలా గెలిపించుకున్నారో... మునుగోడు ఉప ఎన్నికలో కూడా రాజగోపాల్ రెడ్డి ని అలానే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.