కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కరెన్సీ నోట్లు జనం వైపు విసురుతూ కెమెరాకు చిక్కారు. మార్చి 28న మాండ్యలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బెవినహళ్లి సమీపంలో ఆయన రథయాత్ర సాగిస్తూ, తన వాహనం పైనుంచే కరెన్సీ నోట్లు విసరడం కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దక్షిణ కర్ణాటక ప్రాంతంలో వొక్కలిగ సామాజిక వర్గం ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంది. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ఈ ప్రాంతంలో పట్టు సాధించాలని చూస్తున్నారు. మాండ్య నియోజకవర్గం జేడీఎస్ కంచుకోటగా నిలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఏడు స్థానాలనుజేడీఎస్ గెలుచుకుంది. ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి సీఎం పగ్గాలు చేపట్టేందుకు శివకుమార్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.