Special Story: డెడ్​బాడీలకూ గౌరవం లేదా?

Special Story: డెడ్​బాడీలకూ గౌరవం లేదా?

‘జీవించే హక్కు’  అనే అంశంపై  సుప్రీంకోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనలు, జస్టిస్ పీ.ఎన్. భగవతి బెంచ్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు దేశ చరిత్రలో  కీలకంగా నిలిచిపోయాయి. పాస్‌పోర్ట్​ను సీజ్ చేసినంత మాత్రాన.. ఒక వ్యక్తిని దేశం విడిచి వెళ్లకుండా ఆపడం ఆర్టికల్ 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ)కు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కేవలం ఒక న్యాయ పాఠం కాదు. అది మన దేశ న్యాయవ్యవస్థ ప్రజల హక్కులకు ఎంతగా కట్టుబడి ఉందో చెప్పే ఒక స్ఫూర్తిదాయక గాథ.  

న్యాయ విద్యార్థులు ఈ కేసును చదువుకొని, ప్రాథమిక హక్కులపై భారత న్యాయవ్యవస్థకు ఉన్న అపారమైన ప్రేమను చూసి మురిసిపోయేవారు.  కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొన్ని సంఘటనలు మనల్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతోపాటు మరికొందరు మావోయిస్టుల  డెడ్ బాడీలను బంధువులకు అప్పగించకుండా  అనాథ శవాలను దహనం చేసినట్టు కాల్చేశారు. అయినా, న్యాయ కోవిదులు ‘ఈ సబ్జెక్ట్ మాది కాదు’ అన్నట్టుగా  ఉన్నారు. 

 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన 

భారత రాజ్యాంగం కేవలం ఒక చట్టాల సంకలనం కాదు. అది ఒక దేశ ఆత్మ.  దాని మూల స్తంభాలలో  ఒకటి ప్రాథమిక హక్కులు. ఇవి పౌరులకు గ్యారెంటీ ఇచ్చిన రక్షణలు.  ఏ ప్రభుత్వమూ వీటిని ఉల్లంఘించకూడదు. జీవించే హక్కు (ఆర్టికల్ 21), స్వేచ్ఛా హక్కు,  సమానత్వ హక్కు, మత స్వేచ్ఛ హక్కు - ఇవన్నీ ఒక ప్రజాస్వామ్య సమాజానికి పునాదులు.  

మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ‘జీవించే హక్కు’ అంటే కేవలం భౌతికంగా బతకడం కాదని, గౌరవంతో  జీవించే హక్కు అని తెలిపింది.  ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కు,  విద్యాహక్కు,  ప్రైవసీ హక్కు వంటి అనేక అంశాలను ఇందులో అంతర్భాగంగా పరిగణించింది. 

ఈ విస్తృతమైన వ్యాఖ్యానం పౌరుల హక్కుల  పరిరక్షణకు న్యాయవ్యవస్థకున్న నిబద్ధతను తెలియజేస్తోంది.  మరి ఇప్పుడు, శవాల హక్కుల గురించి చర్చ ఎందుకు తలెత్తుతోంది?  మరణించిన వారి శరీరాన్ని గౌరవంగా దహనం చేయడం లేదా ఖననం చేయడం అనేది చాలా సంస్కృతులలో, మతాలలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇది మరణించిన వ్యక్తి గౌరవాన్ని, వారి కుటుంబ సభ్యుల సెంటిమెంట్లను ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ చట్టం కూడా మరణించిన వారిపై గౌరవం చూపాలని నొక్కి చెబుతోంది.  

న్యాయవ్యవస్థ మౌనం!

ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంఘటనలపై  న్యాయ నిపుణులు  బహిరంగంగా చర్చించడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? ఇది మాకు సంబంధించిన  అంశం కాదని తప్పుకోవడంలో ఆంతర్యం ఏమిటి?  రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీలను పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది. 

‘శవాల హక్కులు’ అనే అంశంపై  స్పష్టత లేకపోవడం సమాజంలో  గందరగోళానికి దారితీస్తుంది.  కొన్నిసార్లు తీవ్రవాదులు లేదా దేశద్రోహుల శరీరాలపై ప్రజలకు వ్యతిరేక భావనలు ఉండవచ్చు. వారి నేరాలను బట్టి వారికి శిక్షలు అమలు చేస్తారు. కానీ, మరణానంతరం కూడా వారి శరీరాలను అగౌరవపరచడం అనేది మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధం కాదా? ఇది కేవలం మరణించిన వ్యక్తి గౌరవం గురించే కాదు,  సమాజం నైతికత,  నాగరికతను కూడా ప్రభావితం చేస్తుంది. 

 అభద్రతాభావం వర్సెస్​ రాజ్యాంగ విలువలు

‘ఆ శవాలు తీవ్రవాదులవే కావచ్చు. వారి సిద్ధాంతాలు మా సిద్ధాంతాలకు అస్సలు పడకపోవచ్చు’. - ఈ వాదనలు  భద్రతాపరమైన ఆందోళనల నుంచి ఉద్భవించవచ్చు. శాంతిభద్రతల పేరుతో రాజ్యాంగ సూత్రాలను, మానవ హక్కులను విస్మరించడం ఎంతవరకు సబబు?  ఇది అభద్రతా భావమా లేక అంతర్జాతీయ ఒప్పందాలకు విలువ ఇవ్వకపోవడమా?  భారతదేశం అనేక అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలపై సంతకం చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ (UNHRC)లో సభ్య దేశంగా ఉంది. ఈ ఒప్పందాలు, సంతకాలు కాగితాలకే పరిమితమా?  వాటికి విలువ లేదా? ఈ ప్రశ్నలు మన దేశ అంతర్జాతీయ ప్రతిష్టను, మానవ హక్కులపై  నిబద్ధతను ప్రభావితం చేస్తాయి.   

 రేపటి తరం భవిష్యత్తు

 అధికారం చేతులు మారినప్పుడు, నేడు ఎవరైతే హక్కులను అణచివేస్తున్నారో, అణచివేస్తుంటే చూస్తూ  మౌనంగా ఉన్నారో  రేపు వారే వాటిని కోల్పోవాల్సి రావచ్చు. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.  చట్టబద్ధమైన ప్రక్రియలు, మానవ హక్కులు అనేవి ఏ ఒక్క వర్గానికో లేదా సమూహానికో పరిమితం కావు. అవి అందరికీ వర్తిస్తాయి. అవి ఒక రక్షణ కవచం. ఆ కవచాన్ని బలహీనపరిస్తే, దాని పర్యవసానాలు అందరూ అనుభవించాల్సి ఉంటుంది. ఒక దేశం ఎంత అభివృద్ధి చెందినా, దాని పౌరుల హక్కులను ఎంతవరకు గౌరవిస్తుంది అనే దానిపైనే దాని నాగరికత ఆధారపడి ఉంటుంది.  మానవ హక్కులపై నిర్లక్ష్యం, వాటిని ఉల్లంఘించడం అనేది సమాజంలో హింసకు, అశాంతికి దారితీస్తుంది. ఇది ప్రజల మధ్య అపనమ్మకాన్ని పెంచి, దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది.

 సగటు పౌరుడి ఆశ

ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, న్యాయవ్యవస్థ  ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తన నిబద్ధతను 
పునరుద్ఘాటించాలి. న్యాయ నిపుణులు, పండితులు ఈ అంశంపై బహిరంగంగా చర్చించాలి.  పౌరులకు అవగాహన కల్పించాలి.  ప్రభుత్వం కూడా అంతర్జాతీయ ఒప్పందాలకు, రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉండాలి.  భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించడానికి చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలి. మానవ హక్కులను గౌరవించాలి.  

ప్రతి మనిషికి  గౌరవంగా జీవించే, మరణించే హక్కు ఉంటుంది. ఈ  ప్రాథమిక  సూత్రాన్ని విస్మరిస్తే, సమాజం ఒక అనాగరిక స్థాయికి పడిపోతుంది. మేనకాగాంధీ కేసు స్ఫూర్తిని గుర్తుంచుకోవాలి. మానవ హక్కుల పరిరక్షణకు, న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి మనం అండగా నిలబడాలి.  మన రాజ్యాంగాన్ని, దాని విలువలను మనమే పరిరక్షించుకోవాలి. అప్పుడే భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలబడగలుగుతుంది.

- మేకల ఎల్లయ్య,  సీనియర్ జర్నలిస్ట్-