కాళేశ్వరం రిపేర్లు చేయకుంటే క్రిమినల్ కేసులు!

కాళేశ్వరం రిపేర్లు చేయకుంటే క్రిమినల్ కేసులు!

 

  • బ్యారేజీల రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలదేనని తేల్చి చెప్పిన ప్రభుత్వం
  • ఎన్​డీఎస్ఏ రిపోర్టును తప్పు పడుతూ ఎల్ అండ్ టీ లేఖ రాయడంపై సర్కారు సీరియస్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్​ సంస్థలదేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాదని మొండికేసి.. రిపేర్లు చేయకుంటే సదరు సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకూ వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. 

ఈ అంశంపై రామగుండం సీఈ సుధాకర్ రెడ్డికి ప్రభుత్వం ఇటీవల లేఖ రాసినట్టు తెలిసింది. బ్యారేజీల రిపేర్లకు సంబంధించి ముందుగా చేయాల్సిన టెస్టుల కోసం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)కు రూ.20 కోట్లు ఖర్చవుతాయని, వాటిని మంజూరు చేయాలని కోరుతూ గత నెలలో సుధాకర్ రెడ్డి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ఖర్చులకు సంబంధించిన వివరాలపై సర్కారు ఆరా తీసింది. ప్రొసీడింగ్స్ ఇచ్చిన సుధాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

నిర్మాణ సంస్థల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్​లోనే బ్యారేజీలు దెబ్బతిన్నాయి కదా అని ప్రశ్నించింది. 2019లోనే మూడు బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు బయటపడ్డాయని, అలాంటప్పుడు ఆ ఖర్చులు నిర్మాణ సంస్థనే భరించాల్సి ఉంటుంది కదా అని సుధాకర్ రెడ్డిని ప్రభుత్వం ప్రశ్నించినట్టు తెలిసింది. టెస్టుల దగ్గర్నుంచి.. బ్యారేజీల రిపేర్ల వరకూ నిర్మాణ సంస్థలే ఖర్చులు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్మాణ సంస్థలు అందుకు ఒప్పుకోకపోతే క్రిమినల్ కేసులూ పెట్టాల్సి వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం.

క్రిమినల్ కేసులు పెట్టాలన్న సిఫార్సులు..

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనకు సంబంధించి.. నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఇప్పటికే విజిలెన్స్​ డిపార్ట్​మెంట్ నివేదిక ఇచ్చింది. బ్యారేజీ ఆపరేషనల్ అయినప్పటి నుంచి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సరైన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టలేదని, ఫలితంగా బ్యారేజీలో ఆదిలోనే లోపాలు కనిపించాయని స్పష్టం చేసింది. రిపేర్ల ఖర్చులూ సంస్థతోనే పెట్టించాలని సిఫార్సు చేసింది.

 డిజైన్లలో లోపాలు, సరైన మెయింటెనెన్స్ చేయకపోవడం వంటి కారణాలతో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని రెండు నెలల క్రితం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) నివేదికలోనూ స్పష్టం చేసింది. అయితే, ఎన్​డీఎస్ఏ రిపోర్టునే తప్పు పడుతూ సర్కారుకు ఎల్ అండ్ టీ సంస్థ లేఖ రాయడం.. సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. తాజాగా రిపేర్ల విషయంలోనూ నిర్మాణ సంస్థలతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.