మత్తు వద్దు.. భవిష్యత్ ముద్దు!

మత్తు వద్దు.. భవిష్యత్ ముద్దు!

ప్రపంచం కరోనా, యుద్ధాలు, వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతుంటే, మరో మౌన మహమ్మారి – డ్రగ్స్ వ్యసనం విశ్వరూపం దాల్చుతోంది. ఇది ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని కూడా మింగేస్తోంది. ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. 

1987లో ఐక్యరాజ్యసమితి దీనిని ప్రారంభించింది ప్రత్యేక ఉద్దేశంతో.  ‘ఒక డ్రగ్‌‌‌‌-ఫ్రీ సమాజాన్ని నిర్మించాలి!’ అనే నినాదంతో. ఈ రోజున వ్యసనాల బాధితులకు అవగాహన కల్పించడం, యువత జీవితాలను దుర్వినియోగం నుండి రక్షించడం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలను చైతన్యపరచడం ప్రధాన లక్ష్యం.మాదకద్రవ్యాల వ్యసనం అనేది ఒక గంభీరమైన మానసిక, శారీరక స్థితి. ఇది మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధిగా గుర్తించబడింది. దీన్ని ‘మాదకద్రవ్య వినియోగ రుగ్మత’  అని కూడా పిలుస్తారు.

మానసిక స్థితిని మార్చగలిగే రసాయన పదార్థాలనుమాదకద్రవ్యాలు అంటారు. ఈ పదార్థాలు మానవ శరీరంలో శరీర-మెదడు సమన్వయాన్ని దెబ్బతీసి తాత్కాలికంగా ఊహాజనిత ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ఇవి శారీరక నాశనాన్ని, మానసిక విపరీతాలను, కుటుంబ బంధాల విచ్ఛిన్నాన్ని, సామాజిక శిక్షను తెచ్చిపెడతాయి. నిషేధిత మాదకద్రవ్యాలు (Illegal drugs) నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి. మొదలైనవి ముఖ్యమైనవి. ఇక చట్టబద్ధమైన పదార్థాలు, మద్యం (Alcohol), నికోటిన్ (పొగాకు), నిద్ర మాత్రలు, ఉత్సాహ వృద్ధక మాత్రలు మొదలైనవి.

మాదకద్రవ్య వ్యసనం ఎందుకు?

డ్రగ్ వాడకం ఆరోగ్య సమస్య కాదు. ఇది ఒక మానసిక, సామాజిక, ఆర్థిక సంక్షోభానికి ప్రతిఫల రూపం. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగార్థులు, సాంకేతిక నిపుణులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.  సామాజిక మీడియా పోలికల యుగంలో యువత తాను తక్కువనిపించుకోవడం, అంగీకారంకోసం మత్తు పదార్థాల వైపు మొగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి గంజాయి, బ్రౌన్ షుగర్, హెరాయిన్ మొదలైనవి తీసినవారు, మస్తిష్కంలోని డోపమైన్ వ్యవస్థలో మార్పులు కారణంగా మళ్ళీ అదే స్థాయి ఆనందం పొందాలంటే మోతాదును పెంచాల్సి వస్తుంది. 

దీంతో పూర్తిగా మానసికంగా పరాధీనత ఏర్పడుతుంది. విద్యార్థులపై ప్రభావం, చదువులో వెనుకబడటం, మానసిక స్థిరత్వం కోల్పోవడం, ఆత్మహత్యల శాతం పెరగడం, క్యాంపస్‌‌‌‌లో నేరప్రవర్తనలు, సెక్సువల్ హరాస్మెంట్ పెరగడం, దుష్ట గుంపుల ప్రభావం పెరగడం కుటుంబాలపై ప్రభావం, తల్లిదండ్రుల అపరాధ భావన, ఆర్థికంగా దిగజారటం, కుటుంబ బంధాల విచ్ఛిన్నం, సామాజిక ప్రభావం, నేరాల శాతం పెరుగుతుంది. హింసాత్మక సంఘటనలు, మహిళలపై దాడులు, డ్రగ్ మాఫియాల పుట్టుక, శాంతిభద్రతలు ముప్పు పెరుగుతుంది.

భారతదేశ పరిస్థితి, వాస్తవాలు 

యూఎన్​ఓడీసీ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి 35 కోట్లకు పైగా వ్యక్తులు డ్రగ్‌‌‌‌లను ఉపయోగించారు.60 లక్షల మందికి పైగా మృతిచెందారు. ఇక భారతదేశంలో డ్రగ్ వ్యసన బారిన పడిన యువత  సుమారు 3.2 కోట్ల మంది (15–35 ఏళ్ల వయస్సు), హైదరాబాద్‌‌‌‌లో డ్రగ్ కేసులు పెరుగుతున్నాయి.  

డ్రగ్ వల్ల ప్రతి సంవత్సరం మరణాలు ప్రపంచవ్యాప్తంగా 6 లక్షలు. డ్రగ్ స్మగ్లింగ్‌‌‌‌కు పాల్పడే ప్రతి 10 మందిలో   ముగ్గురు  మహిళలు ఉంటున్నారు. మన దేశంలో 18-–30 ఏళ్ల యువతలో డ్రగ్ వినియోగం38%  ఉంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఢిల్లీ  అత్యధిక ప్రభావిత రాష్ట్రాలు. ప్రతి రోజు డ్రగ్ సంబంధిత అరెస్టులు సగటు 500, వార్షికంగా డ్రగ్ కారణంగా మరణాలు సుమారు 1.4 లక్షలు. యువత ముఖ్యంగా గంజాయి, బ్రౌన్ షుగర్, డ్రగ్ మిక్స్ చేసిన సిరంజి మాదకాలు వాడుతున్నారు. 

పంజాబ్, మణిపూర్, ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ ప్రధాన కేంద్రాలుగా మారాయి. 2024 నాటికి హైదరాబాద్‌‌‌‌లో నార్కొటిక్స్ కేసులు 200% పెరిగాయి.పెరుగుతున్న రేవ్ పార్టీలు, వర్సిటీ లెవల్లో గంజాయి వాడకం, హాయి  కలిగించే టాబ్లెట్ల వినియోగం  ఇవన్నీ తీవ్ర ముప్పుగా మారాయి.

డ్రగ్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ?

శిక్షల కఠినతకు లొంగని డ్రగ్ మాఫియా, ఎన్డీపీఎస్​ చట్టం ఉన్నా అన్వయించడంలో అసమర్ధత, రాజకీయ మద్దతు వల్ల మాఫియా శక్తులు పెరిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే కొత్త ముఠాలు, డార్క్ వెబ్, క్రిప్టోకరెన్సీ, ఫేక్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ల ద్వారా పట్టుకోలేని విధంగా డ్రగ్ డీలింగ్ జరుగుతోంది. ప్రభుత్వాల అలసత్వం, పునరావాస కేంద్రాలు  తక్కువ, మానసిక చికిత్సకు ప్రోత్సాహం లేదు. డ్రగ్ బాధితులను నేరస్థులుగా చూసే వ్యవస్థ ఇంకా మారలేదు.

వ్యసన నివారణ మార్గాలు

డ్రగ్‌‌‌‌లు కలిగించే నష్టాలపై సకాలంలో అవగాహన కల్పించాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. సానుకూల వాతావరణంలో ఉండాలి. కుటుంబంగా పిల్లలతో అనురాగ సంబంధం పెంచాలి. వారిని గమనించాలి, మార్పులను వెంటనే గుర్తించాలి. హాస్యం, వినోదం, సంస్కృతులు ప్రోత్సహించాలి. విద్యాసంస్థల్లో, నార్కొటిక్ అవగాహన శిబిరాలు నిర్వహించాలి.కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రతి విద్యార్థి మానసిక స్థితిని పరిశీలించాల్సిన బాధ్యత ఉండాలి. ప్రభుత్వ స్థాయిలో, ఐటీ, నార్కొటిక్ సెల్‌‌‌‌లు బలోపేతం, రిహాబిలిటేషన్ కేంద్రాలు పెంపు, డ్రగ్ ట్రాఫికింగ్‌‌‌‌పై గట్టి చట్టాలు, యువత కోసం డ్రగ్-ఫ్రీ క్లబ్‌‌‌‌లు ఏర్పాటు చేయాలి.

 డ్రగ్స్ మనకు తాత్కాలిక హాయి, శాశ్వత నాశనం ఇస్తాయి. ఒక్కసారి ప్రారంభిస్తే, తిరిగి మార్గం ఉండకపోవచ్చు. డ్రగ్‌‌‌‌లపై విజయం  మనలోనే మొదలవుతుంది. నేను – నా కుటుంబం – నా సమాజం అనే భావనతో డ్రగ్-ఫ్రీగా ఉండాలని చూడాలి. మానవ జీవితాన్ని మత్తులో ముంచొద్దందాం. మానవత్వంతో నిలబడుదాం! ‘డ్రగ్స్‌‌‌‌ను కాదనండి – జీవితాన్ని ఆమోదించండి!’

-డాక్టర్. బి. కేశవులు,మానసిక వైద్యుడు-