చనిపోయిన ప్రీతికి ట్రీట్ మెంట్ చేశారు : బండి సంజయ్

చనిపోయిన ప్రీతికి ట్రీట్ మెంట్ చేశారు : బండి సంజయ్

చనిపోయిన ప్రీతికి నాలుగు రోజులపాటు.. హైదరాబాద్ నిమ్స్ లో ట్రీట్ మెంట్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఒక రోజు దీక్ష చేశారాయన. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. ప్రీతి కేసులో కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసును పక్కదారి పట్టిస్తుందని విమర్శించారాయన. ప్రీతి ఎందుకు చనిపోయింది.. ఎలా చనిపోయింది అనే విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని.. ఎందుకు నిజాన్ని దాచి పెడుతుందని ప్రశ్నించారాయన. 

కేసీఆర్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ కండువాను మెడలో వేసుకని.. ఎన్ని అరాచకాలు అయినా చేయొచ్చని.. ఎన్ని అఘాయిత్యాలు అయినా చేయొచ్చని.. అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. తెలంగాణ ఆడబిడ్డల కోసం.. వారి భద్రత కోసం.. వారికి అండగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు భరోసా ఇచ్చారాయన. శవాలను ఎత్తుకెళ్లి రాజకీయం చేసే దుర్మార్గమైన.. నీచమైన స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి. దేశంలో ఎక్కడా లేని విధంగా.. చనిపోతే సంతాపం.. బతికుంటే పరిహారం లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. 

రాష్ట్రంలో అడబిడ్డలు చనిపోతుంటే కనీసం పరామర్శించటం లేదని.. ప్రగతిభవన్ నుంచి బయటకు రావటం లేదంటూ కేసీఆర్ తీరును ఎండగట్టాడు బండి సంజయ్. రాష్ట్రంలో క్రిమినల్స్ స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. నేరాలు – ఘోరాలు జరుగుతుంటే కనీసం రివ్యూ చేసే టైం కూడా కేసీఆర్ కు లేకపోవటం దౌర్భాగ్యం అన్నారు. ఎక్కువ నేరాలు చేసిన వాళ్లకు సన్మానాలు చేసే నీచ, నికృష్ణమైన ప్రభుత్వం నడుస్తుందన్నారు. మహిళల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నది ఒక్క బీజేపీ పార్టీనే అని.. వారికి దైర్యం, భరోసా, ఆత్మస్తైర్యం కోసం నిరంతరం అండగా ఉంటుందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు గుణపాఠం చెప్పే రోజులు వచ్చాయని.. బీజేపీ ప్రభుత్వం వస్తేనే మహిళలకు భరోసా వస్తుందన్నారు.