5.4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కాళ్లు తీయించుకున్నడు

5.4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కాళ్లు తీయించుకున్నడు
  • బ్రిటన్​లో నీల్ హాప్పర్‌‌‌‌ అనే డాక్టర్ నిర్వాకం 

లండన్: బ్రిటన్​లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ డాక్టర్ రూ.5.4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన రెండు కాళ్లను తీయించుకున్నాడు. విషయం బయటకు రావడంతో పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు. యునైటెడ్ కింగ్‌‌‌‌డమ్‌‌‌‌లోని కార్న్‌‌‌‌వాల్ కు చెందిన డాక్టర్ నీల్ హాప్పర్.. వాస్కులర్ సర్జన్(రక్త నాళాల వ్యాధులు)గా పనిచేస్తున్నాడు.  రాయల్ కార్న్‌‌‌‌వాల్ హాస్పిటల్స్ ఎన్ హెచ్ఎస్  ట్రస్ట్‌‌‌‌లో 2013 నుంచి 2023 వరకు విధులు నిర్వర్తించాడు. అతను అవీవా గ్రూప్ కంపెనీ, ఓల్డ్ మ్యూచువల్ కంపెనీల్లో ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఆ డబ్బును ఎలాగైనా క్లెయిమ్‌‌‌‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం 2019లో తెలిసిన డాక్టర్ ద్వారా తన రెండుకాళ్లను తీయించుకున్నాడు. 

సెప్సిస్ అనే ఇన్ఫెక్షన్‌‌‌‌ కారణంగా తన కాళ్లు తీయించుకున్నట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలియజేశాడు.  అవీవా గ్రూప్ కంపెనీలో సుమారు రూ. 2.47 కోట్లు, అలాగే..ఓల్డ్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీలో సుమారు రూ. 2.42 కోట్లు మొత్తం రూ. 5.4 కోట్లు క్లెయిమ్ చేసేందుకు ప్రయత్నించాడు. అంతేగాక, మారియస్ గుస్తావ్‌‌‌‌సన్ అనే మరో వ్యక్తితో కలిసి "యూనక్‌‌‌‌మేకర్" వెబ్‌‌‌‌సైట్ ద్వారా ఇతరులను బాడీ మాడిఫికేషన్ కార్యకలాపాలకు పాల్పడ్డాడు.

 ఈ క్రమంలోనే ఇన్సూరెన్స్ కంపెనీలు.. నీల్ హాప్పర్ కు సెప్సిస్ ఇన్ఫెక్షన్‌‌‌‌ సోకలేదని గుర్తించారు. దానికి అతను సరైన ఆధారాలు చూపించలేదని, తమను మోసం చేసే ప్రయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దర్యాప్తులో అతను చేస్తున్న బాడీ మాడిఫికేషన్ కార్యకలాపాలను కూడా పోలీసులు గుర్తించారు. నీల్ హాప్పర్ ను అరెస్ట్ చేసి బుధవారం కార్న్‌‌‌‌వాల్ మేజిస్ట్రేట్స్ కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నోరు మెదపకపోవడంతో అతడిని కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది.