వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ లక్ష్మీకుమారి న్యాయం చేయాలంటూ సోమవారం తమ హాస్పిటల్ ముందే మౌన పోరాటానికి దిగారు. పలు మహిళా సంఘాలు ఆమెకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నాయి. బాధితురాలు మాట్లాడుతూ స్కిన్ స్పెషలిస్ట్ అయిన తాను వనపర్తిలో 22 ఏండ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నానన్నారు. పిల్లల డాక్టర్ అయిన తన భర్త ప్రమోద్ కుమార్ తో పాటు అతడి కుటుంబసభ్యులు తాను ప్రాక్టీస్ చేయగా వచ్చిన డబ్బులన్నీ గుంజుకుని ఇంటి నుంచి పంపించేయాలని ప్లాన్ చేశారన్నారు. తన భర్త తన క్లినిక్ రిజిస్ట్రేషన్ ను క్యాన్సిల్ చేయాలని అప్లై చేశాడని, 2024 వరకు టైం ఉన్నా కూడా క్లినిక్ షట్టర్లకు తాళాలేశాడన్నారు.
తన క్లినిక్ను తెరిపించాలని వనపర్తి పీఎస్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అందుకే మౌన దీక్షకు దిగినట్టు ప్రకటించారు. తన కష్టార్జితమంతా క్లినిక్ కోసం, కుటుంబం కోసం ఖర్చు పెట్టానన్నారు. తన భర్త విడాకుల నోటీసు పంపించారని, అది తనకు ఇష్టం లేదన్నారు. క్లినిక్ తెరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
