- సీజేపీపై దాఖలైన పిటిషన్ విచారణలో అర్జెన్సీ లేదన్న సుప్రీం
- ఈ అంశంలో సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరిన న్యాయవాది
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అంశాన్ని ఎమోషనల్గా తీసుకోవద్దని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కోర్టు విచారణల రికార్డింగ్లను దుర్వినియోగం చేస్తున్నారని, సీజేపీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అత్యవసరంగా విచారించాలని కోర్టును కోరారు.
దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో ఎలాంటి అత్యవసర విచారణ అవసరం లేదని, దీనిని తాము పరిశీలిస్తామని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఇటీవల చోటుచేసుకున్న కాక్రోచ్ వ్యాఖ్యల వివాదంపై సీజేఐ ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ, కొందరు కావాలనే తప్పుడు, దురుద్దేశపూర్వక కథనాలను ప్రచారం చేస్తున్నారని సదురు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘కోర్టు విచారణల సమయంలో జరిగే మౌఖిక చర్చలను వాణిజ్యపరంగా వాడుకోకూడదు, న్యాయ ప్రక్రియను వక్రీకరించేలా వాటిని సోషల్ మీడియాలో క్లిప్పులుగా ప్రచారం చేయకుండా నిలువరించాలి’’ అని పిటిషనర్ కోరారు. అలాగే, దేశంలో 35 నుంచి 40 శాతం వరకు నకిలీ లా డిగ్రీలు ఉన్నాయంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్పర్సన్ చేసిన ప్రకటనపై కూడా సీబీఐ దర్యాప్తు జరపాలని ఈ పిటిషన్లో అభ్యర్థించారు. కోర్టు వ్యాఖ్యలను కేవలం పబ్లిసిటీ ప్రచారాల కోసమే వాడుకుంటున్నారని పిటిషనర్ వాదించారు.
న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో జరుగుతున్న కార్యకలాపాలను కోర్టు నిశితంగా పరిశీలిస్తోందని సీజేఐ అన్నారు. వారు ఫేస్బుక్, యూట్యూబ్ తదితర వాటిల్లో పోస్ట్ చేస్తున్న విషయాలను తాము గమనించడం లేదని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అలాగే, ఢిల్లీకి చెందిన కొందరు న్యాయవాదుల లా డిగ్రీలపై తనకు సందేహాలు ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
