హైదరాబాద్, వెలుగు: యువత విదేశీ కల్చర్కు బానిసలు కావొద్దని, అవకాశం ఉన్నచోట మన సంస్కృతిని ప్రదర్శించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. భారత సంస్కృతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మోదీ నేతృత్వంలో కృషి చేస్తున్నామని తెలిపారు. కనుమరుగు అవుతున్న కళలను కాపాడేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మంగళవారం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో సాంస్కృతిక ఉత్సవం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సహకారంతో ‘వన్ భారత్ శారీ వాకథాన్’ నిర్వహించారు. గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిథిగా హాజరై, జెండా ఊపి ప్రారంభించారు.
కేంద్ర మంత్రులు దర్శన జర్దోష్, కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. శారీ వాకథాన్తోపాటు నాలుగురోజులపాటు నేషనల్కల్చరల్ ఫెస్టివల్ అద్భుతంగా సాగిందన్నారు. ఏక్ భారత్.. శ్రేష్ఠ్భారత్ నినాదంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన 600 మంది కళాకారులు సిటీలో ప్రదర్శనలు ఇచ్చారన్నారు. కేంద్రం సహకారంతో తెలంగాణలో, ఢిల్లీలో బతుకమ్మ పండుగ, విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, సౌత్ ఇండియా కల్చరల్ సెంటర్ ను హైదరాబాద్లో ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు రోజుల్లో సంజీవయ్య పార్కులో లేజర్ షో ప్రారంభిస్తామని తెలిపారు.
చేనేత కళారూపాలను ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. మహిళలు చీరలో అందంగా కనిపిస్తారని, చీరలు మన దేశానికి, సంస్కృతికి నిదర్శనమని గవర్నర్తమిళిసై చెప్పారు. అమ్మాయిలు వారంలో ఒక్కసారైనా నేత చీరలో కాలేజీకి వెళ్లాలని, మన సంస్కృతిని ప్రమోట్ చేయాలని సూచించారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు, యువతులు పీపుల్స్ప్లాజా నుంచి పీవీ విగ్రహం వరకు వాకథాన్ నిర్వహించారు. తర్వాత దాదాపు 600 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో ఆనంద్ శంకర్, శ్రీవిద్య, వైష్ణవి, కూచిపూడి డ్యాన్సర్ పద్మజారెడ్డి, విద్యారెడ్డి, దీపికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.