డాక్టరే డ్రైవర్‌ అయిండు.. కరోనా డెడ్‌బాడీని శ్మశానికి తీసుకెళ్లాడు

డాక్టరే డ్రైవర్‌ అయిండు.. కరోనా డెడ్‌బాడీని శ్మశానికి తీసుకెళ్లాడు
  •         ఆక్సిజన్‌ అందక పేషెంట్‌ మృతి
  •         భయపడి ముందుకు రాని మున్సిపల్ సిబ్బంది
  •         పెద్దపల్లి దవాఖానాలో ఘటన

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానాలో ఆదివారం ఆక్సిజన్ అందక ఓ కరోనా పెషెంట్ చనిపోయాడు. పట్టణంలోని తెనుగువాడకు చెందిన ఓ వ్యక్తికి ఈ నెల 10న పాజిటివ్ వచ్చింది. మెడికల్ సిబ్బంది షుగర్ ఉన్నట్టు గుర్తించి, కాంటాక్ట్ అయిన వ్యక్తుల వివరాలు తీసుకున్నారు. షుగర్ ఉందని తెలిసీ  హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని సూచించారు. దీంతో రెండు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆదివారం ఉదయం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు 108లో పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోవడం, ఐసోలేషన్ వార్డులో ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు లేకపోవడంతో అతడు చనిపోయాడు. అతడి డెడ్‌బాడీని తీసుకువెళ్లడానికి మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినా సదరు డ్రైవర్ ట్రాక్టర్‌ నడిపేందుకు ఒప్పుకోలేదు.  గంటపాటు చూసినా ఎవరూ రాలేదు. దీంతో పెద్దపల్లిలో కరోనా వైరస్ కోసం డిస్ట్రిక్ట్ సర్వీలెన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్ శ్రీరాం ట్రాక్టర్‌ నడిపి శ్మశానానికి తీసుకెళ్లారు. జిల్లాలో 59 మంది కరోనా పేషెంట్లు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జిల్లాలో ఎక్కడా ఆక్సిజన్ ఏర్పాట్లు లేవు.

ఆర్టీసీకి 2 నెలల్లో రూ.600 కోట్లు లాస్