శాస్త్రీయ కులగణన.. సమానత్వానికి పునాది.. గణన ఎలా జరుగుతుందంటే..

శాస్త్రీయ కులగణన.. సమానత్వానికి పునాది.. గణన ఎలా జరుగుతుందంటే..

గణన అనే ప్రక్రియ కేవలం లెక్కలు వేయడానికే కాదు. శాసన, పాలనా, న్యాయ వ్యవస్థలు సామాజిక న్యాయాన్ని ఎలా సాధించాలో తేల్చే ఆధారంగా మారాలి. అంబేద్కర్ దృక్పథం చాలా స్పష్టమైనది. భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలోనే డా. బీఆర్. అంబేద్కర్ స్పష్టంగా హెచ్చరించారు.  పాలకవర్గం చేతిలో  ప్రామాణిక గణాంకాలు లేకపోతే, అవగాహనల ఆధారంగా, అంచనాల ఆధారంగా పాలన సాగుతుంది. అది మరింత అసమానతలకు దారితీస్తుంది.  కాబట్టి, గణన అనేది సామాజిక న్యాయ ప్రయాణానికి మౌలిక అవసరం. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అనేకవర్గాలు గణనలలో పూర్తిగా కనిపించలేదు. దాని ప్రభావమే వారికి హక్కులు, వనరులు పూర్తిగా అందకపోవడం. అందుకే 2027లో జరగనున్న కులగణన ఓ తరం ఆశలకి ప్రతిఫలమవ్వాలి.  SECC–2011 తప్పుల పాఠం మళ్లీ జరగకూడదు.

2011లో  కేంద్రం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులగణనలో దాదాపు 46.73 లక్షల మంది  కులాల పేర్లు తప్పుగా నమోదయ్యాయి.  ఒకే వర్గానికి వేర్వేరు ప్రాంతాల్లో వేరు పేర్లు, సరైన కోడ్‌‌లు లేకపోవడం వల్ల ఈ గణన ప్రభుత్వ విధానాలకు పనికిరాని డేటాగా మిగిలిపోయింది. దాదాపు రూ.4,893 కోట్ల వ్యయం వృథా అయింది.  అయితే, ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, SECC గణనను జనాభా గణనచట్టం కింద జరపలేదు. గణన అధికారికంగా  రిజిస్ట్రార్​ జనరల్​ ఆఫ్​ ఇండియా ద్వారా జరగలేదు. దాంతో, డేటాకు  చట్టబద్ధత  లేకుండాపోయింది.  తర్వాత  ప్రభుత్వం ఆ డేటాను వినియోగించలేనని  పార్లమెంటులో స్పష్టం చేసింది. ఈ పాఠం ఇప్పుడు మనకు ప్రధానమైన గుణపాఠం.  2027 గణనను చట్టబద్ధంగా, శాస్త్రీయంగా,  ప్రజల విశ్వాసంతో నిర్వహించాల్సిన అవసరం ఉంది.

ఒకే వర్గానికి వేరు పేర్లు
ఒకే సామాజిక వర్గానికి  వేరుప్రాంతాల్లో  వేరుగా పేర్లు ఉండటం దేశవ్యాప్తంగా కనిపించే సాధారణ విషయం. ఉదాహరణకు ముత్యాలవాండ్లు, దేవరవాండ్లు, పెద్దమ్మలవాండ్లు పేర్లు ఉన్నవారు బీసీ జాబితాలో ఉంటారు. అదే వర్గానికి చెందిన పోచమ్మలవాండ్లు అనే పేరు వాడుతున్న వారు జాబితాలో ఉండకపోవచ్చు. ఇది కేవలం స్థానిక పదప్రయోగం వల్ల ఏర్పడిన భిన్నత కాదు. ఇది ప్రజలకు తాము అనుభవించే భాషలో తమ గుర్తింపును వెల్లడించే అంశం. అలాంటి సందర్భంలో గణనలో వారి గుర్తింపును తక్కువ చేయడం లేదా కోల్పోవడం అన్యాయంగా మారుతుంది.  అందుకే  ప్రతి రాష్ట్రానికి తాత్కాలిక కుల జాబితాలు రూపొందించాలి. ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ నంబరు ఇవ్వాలి.  ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తుది జాబితా ప్రకటించాలి.  ముస్లిం, క్రైస్తవ వర్గాల్లో  ప్రొఫెషన్ బేస్డ్ కమ్యూనిటీలను కూడా చేర్చాలి.  కేంద్ర, రాష్ట్ర జాబితాల మధ్య ఉన్న తేడాలను ప్రశ్నాపత్రంలో స్పష్టంగా చూపించాలి.  పబ్లిక్ ఫీల్డ్ టెస్టింగ్ చాలా ముఖ్యమైనది. ఇది చేసిన తర్వాతే తుది ప్రశ్నాపత్రం ఖరారు చేయాలి. లేకపోతే  గణనలో పునరావృత లోపాలు జరగొచ్చు.

2027 కులగణన దృశ్య మానం
జనాభా గణన చట్టం (1948) ప్రకారం  మొదటిదశ అక్టోబర్ 2026లో  మంచు ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్,  అనంతరం  రెండోదశ మార్చి 2027లో  దేశవ్యాప్తంగా జనాభా, కులగణన జరుగుతుంది.  వ్యయం రూ.13,000 కోట్లు. గత గణనలో SECC–2011లో  46.73 లక్షల తప్పులు,  రూ.4,893 కోట్ల నష్టం జరిగింది.  ఈసారి టాబ్లెట్ ఆధారిత డేటా, ఇంటింటి లెక్కలు,  స్వయం లెక్కింపు పోర్టల్ ఉంటుంది. చట్టపరమైన ఆధారాలు..  రాజ్యాంగంలోని 15(4), 16(4), 330–332, 243-D(1)(2)(6), 243-T(1)(6), 342A, 105వ రాజ్యాంగ సవరణలు.  ప్రధాన ప్రయోజనాలు.. జాతీయ బీసీ జాబితా స్పష్టత. ఉపవర్గీకరణకు దారితీసే గణన.  నియోజకవర్గాల పునర్విభజనకు ఆధారం. రిజర్వేషన్ల పెంపునకు సమగ్ర లెక్కల ఆధారం. ఓట్ల రాజకీయాలను మించి పాలనా దృష్టితో  కమిషన్ల అమలు. ఈ గణన కేవలం గణాంక ప్రక్రియ కాదు. ఇది ఒక తరం ఎదురుచూస్తున్న న్యాయబద్ధ గుర్తింపు.  గణనలో ఎవరూ మిగలకుండా సంపూర్ణంగా జరగాలి. 2027 కులగణన పాలనా పారదర్శకతకి పునాది.  సామాజిక  సమానత్వానికి శాశ్వత ఆధారం కావాలి.  

గణన ఎలా జరుగుతుందంటే..
ఈ గణన రెండు దశల్లో జరుగుతుంది. మొదట హౌస్ లిస్టింగ్ దశ. ఇది అక్టోబర్ 2026 నుంచి మంచు ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. తరువాత జనాభా, కులగణన దశ మార్చి 2027 నుంచి దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రతి ఇంటికీ వెళ్లి సమాచారం సేకరిస్తారు. ‘టాబ్లెట్’ ఆధారంగా  డేటాను నమోదు చేస్తారు.  ఒకవేళ ఎవరైనా ఇంటివద్ద లేకపోతే లేదా ఇతర కారణాల వల్ల డేటా మిస్ అయితే,  స్వయం లెక్కింపునకు ప్రత్యేకంగా ఆన్‌‌లైన్ పోర్టల్ కూడా  అందుబాటులో ఉంటుంది.  డేటాలో  కులానికి  ప్రత్యేక కోడ్‌‌లు ఇవ్వడం తప్పనిసరి.  ఇది  సాంకేతిక ఖచ్చితత్వానికి మూలస్తంభం.  డేటా భద్రతకు ప్రత్యేక మెకానిజం ఉండాలి.  ఇది  సమగ్రంగా డిజిటల్ ఆధారంగా జరగాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇది ముందుకు సాగాలి.  ప్రతి రాష్ట్రం NCBC (National Commission for Backward Classes) గైడెన్స్ ప్రకారం గణన చేయాలి. అదే సమయంలో RGI ఆధ్వర్యంలో ఒకే విధానం దేశవ్యాప్తంగా ఉండాలి.  జస్టిస్ రోహిణీ కమిషన్ (OBC ఉపవర్గీకరణ) 2017లో  ఏర్పడింది. 2021లో నివేదిక ఇచ్చింది.  కానీ, గణన డేటా లేకపోవడం వల్ల అమలు ఆలస్యం అవుతోంది. ఉప వర్గీకరణ చేయాలంటే ప్రతి ఉపవర్గం ఎంతమంది ఉన్నారు అనే స్పష్టమైన గణాంకాలు అవసరం.  రేంకే, ఐడేట్ కమిషన్లు దేశవ్యాప్తంగా సంచార, విముక్త జాతుల జీవన పరిస్థితులపై  నివేదికలు సమర్పించాయి. కానీ, అవి కూడా కులగణన డేటా ఆధారంగానే  ప్రయోజనకరంగా  మారతాయి.  ఇవి ఓట్ల రాజకీయానికి కాకుండా,  పాలనా మార్గదర్శకాలకు ఆధారంగా నిలవాలంటే  జరగబోయే  గణన చట్టబద్ధంగా, శాస్త్రీయంగా ఉండాల్సిందే.

డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ చైర్మన్,  తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్