DRDO రికార్డు: మైనస్ ఉష్ణోగ్రతలో 22 వేల అడుగుల ఎత్తు నుంచి స్వదేశీ పారాచూట్ టెస్ట్ సక్సెస్

DRDO రికార్డు: మైనస్ ఉష్ణోగ్రతలో 22 వేల అడుగుల ఎత్తు నుంచి స్వదేశీ పారాచూట్ టెస్ట్ సక్సెస్

భద్రతా రంగంలో భారత్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వ సంస్థ DRDO సరికొత్త రికార్డు సృష్టించింది. లడఖ్ జిల్లాలోని లేహ్ ప్రాంతంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో మేడ్ ఇన్ ఇండియా మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. సుమారు 22 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి సేఫ్ ల్యాండింగ్‌తో ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించినట్లు డీఆర్‌డీఓ బుధవారం అధికారికంగా వెల్లడించింది.

ఈ అత్యాధునిక మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్‌ను డీఆర్‌డీఓకు చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ల్యాబ్ ప్రత్యేకంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డ్రాప్ జోన్లలో ఒకటైన లడఖ్‌లోని న్యోమా-ముధ్ డ్రాప్ జోన్‌లో ఈ పరీక్షను నిర్వహించారు. సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో.. మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ అత్యంత శీతల వాతావరణంలో ఈ సాహసోపేతమైన పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ పరీక్షలో ఏడీఆర్‌డీఈకి చెందిన చీఫ్ టెస్ట్ జంపర్ వింగ్ కమాండర్ రాహుల్ ఝా, మాస్టర్ వారెంట్ ఆఫీసర్ ఆర్.జె. సింగ్, మాస్టర్ వారెంట్ ఆఫీసర్ వివేక్ తివారీలు పాల్గొని విజయవంతంగా జంప్ చేశారు. వీరు కేవలం పారాచూట్‌ను మాత్రమే కాకుండా.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పారా కంప్యూటర్, ఆక్సిజన్ సిస్టమ్, ప్రత్యేక జంప్‌సూట్లు వంటి అన్ని వస్తువులను కూడా సమర్థవంతంగా పరీక్షించారు. 20 వేల అడుగుల ఎత్తులో పారాచూట్ ఓపెన్ కాగా.. చివరకు 13వేల700 అడుగుల ఎత్తులో సురక్షితంగా ల్యాండింగ్ అయ్యారు.

ఈ విజయవంతమైన పరీక్ష ద్వారా మన రక్షణ వ్యవస్థల పనితీరు, నమ్మకం, అత్యవసర సమయాల్లో ఉపయోగించే వ్యూహాత్మక సామర్థ్యం ఎంత బలంగా ఉన్నాయో నిరూపితమైందని డీఆర్‌డీఓ పేర్కొంది. విదేశీ రక్షణ పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు, ప్రత్యేక సైనిక ఆపరేషన్ల కోసం దేశీయంగానే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే భారత్ లక్ష్యానికి ఈ సక్సెస్ పెద్ద ప్రోత్సాహంగా నిలుస్తుంది.

ALSO READ : అల్యూమినియం ఉత్పత్తి రంగంలోకి అంబానీ..

దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఈ పారాచూట్ సిస్టమ్ మన సైనికులకు మరింత రక్షణగా నిలవనుంది. ముఖ్యంగా అత్యంత శీతల ప్రాంతాలు, కఠినమైన కొండ ప్రాంతాలలో జరిగే సైనిక ఆపరేషన్లలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదానికి తగినట్లుగా రక్షణ రంగంలో భారత్ రోజురోజుకూ సాధిస్తున్న విజయాలు దేశానికే గర్వకారణంగా మారుతున్నాయి.