బాలీవుడ్ డైరెక్టర్ నిశికాంత్ కామత్ (50) మృతి

బాలీవుడ్ డైరెక్టర్ నిశికాంత్ కామత్ (50) మృతి

ముంబై: బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నిశికాంత్ (50) కామత్ సోమవారం కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చనిపోయాడు. ఈ వార్తను ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. హిందీలో దృశ్యం, మదారి, ముంబై మేరీ జాన్ లాంటి మూవీస్‌తో నిశికాంత్ క్రేజ్ సంపాదించాడు. మరాఠీలో కూడా సాత్చ్యా, ఆట్ ఘారట్ సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లో జాన్‌ అబ్రహాం హీరోగా నటించిన రికీ హ్యాండ్‌సమ్‌లో నిశికాంత్ విలన్‌గా కనిపించాడు. భవేశ్ జోషి సూపర్ హీరో, ఫుగ్లీ, జూలీ 2 సినిమాల్లో కూడా నిశికాంత్ యాక్ట్‌ చేశాడు. దర్బదర్ అనే మూవీలో నిశికాంత్ పని చేస్తున్నాడు. ఇంతలో ఈ విషాదం చోటుచేసుకుంది. కామత్ లివర్ కిర్హోసిస్‌తో బాధపడ్డారని తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమం కావడంతో ఏఐజీలో కామత్‌ను చేర్చారు. కామత్ మరణ వార్తను బాలీవుడ్ యాక్టర్ రితేశ్ దేశ్‌ముఖ్‌ ట్విట్టర్‌‌లో కన్ఫార్మ్ చేశారు. నేను నిన్ను మిస్సవుతా నా మిత్రమా అంటూ రితేశ్ ట్వీట్ చేశారు.

నిశికాంత్ మృతిపై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘నిశికాంత్‌తో నా సాన్నిహిత్యం దృశ్యం సినిమాకు సంబంధించినది మాత్రమే కాదు. ఆ మూవీని ఆయన తెరకెక్కించగా, నేను టబూ కలసి నటించాం. ఆయన అసోసియేషన్‌ నాకు ఇష్టం. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ఉండేవారు. ఆయన చాలా త్వరగా వెళ్లిపోయారు’ అని అజయ్ ట్వీట్ చేశారు.