
కేరళకు చెందిన యూట్యూబర్ సంజు టెక్కీ ఓ మలయాళం సినిమా స్ఫూర్తితో ఓ స్టంట్ను రీక్రియేట్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. కదులుతున్న కారులో టార్పాలిన్ షీట్తో తాత్కాలికంగా స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేసి అందులో నీళ్లను నింపాడు. అయితే, డ్రైవర్ సీటు, ఇంజిన్లోకి నీరు రావడంతో స్టంట్ వికటించింది. ఈ క్రమంలో వాటర్ ను కంట్రోల్ చేయడానికి కారును రోడ్డుపైనే ఆపవలసి వచ్చింది. దీంతో అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సంజుపై కేసు బుక్ చేశారు.
అంతేకాకుండా అతని డ్రైవింగ్ లైసెన్స్ ను ఏడాది పాటు రద్దు చేశారు పోలీసులు. స్టంట్కు ఉపయోగించిన సఫారీని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సంజుతో పాటు మరో ముగ్గురిని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వారం రోజుల పాటు సామాజిక సేవ చేయాలని, ఆ విభాగం శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. కాగా సంజు తన స్నేహితులతో కలిసి చేసిన ఈ స్విమ్మింగ్ పూల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.