- హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, వెలుగు : అబిడ్స్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాటి సీఎం కేసీఆర్పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ నాయకుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ ఈ నెల 22న విచారణ చేపట్టనున్నారు.
తాను 2022, ఆగస్టు 14న ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను ప్రశ్నించానని చెప్పారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ను అసభ్య పదజాలంతో దూషించానంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ కో కన్వీనర్ రవికుమార్ తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని వెల్లడించారు. ఆయన ఫిర్యాదుతో ఆగస్టు 18న సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తర్వాత ఆ కేసును అబిడ్స్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ కేసులో భాగంగా ట్రయల్ కోర్టులో చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ లో వివరించారు.
