- 1,030 గ్రాముల చరస్, 2 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీలో డ్రగ్స్, గంజాయి సప్లయ్ చేస్తున్న ముగ్గురు సభ్యుల చరస్ ముఠాను యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లతో పాటు పహాడీషరీఫ్కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద 1,030 గ్రాముల చరస్, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7లక్షలు ఉంటుందని టీన్యాబ్ ఎస్పీ చక్రవర్తి గుమ్మి తెలిపారు. పహాడీషరీఫ్కు చెందిన సయ్యద్ జావీద్(50) పాతబస్తీలోని యువతకు గంజాయి, డ్రగ్స్ సేల్ చేస్తున్నాడు.
మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన హైదర్ ఇక్బాల్ సిద్ది మక్వ(35), ముస్తక్ షా(35) వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ సప్లయ్ చేస్తున్నాడు. ఫోన్ కాంటాక్ట్తో ఆర్డర్స్ తీసుకుని సేల్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదర్ ఇక్బాల్, ముస్తక్ షా మంగళవారం హైదరాబాద్ వచ్చారు. సమాచారం అందుకున్న టీ న్యాబ్ పోలీసులు పహాడీషరీఫ్ పోలీసులతో కలిసి నిఘా పెట్టి ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి చరస్, గంజాయి, సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.