
- ఇన్నాళ్లూ బాధితులుగా పరిగణిస్తూ కౌన్సెలింగ్, డీఅడిక్షన్ సెంటర్లకు తరలింపు
- మార్పు రాకపోవడంతో రూట్ మార్చిన ఈగల్, నార్కోటిక్స్ వింగ్
- మల్నాడు కేసులో డాక్టర్ సహా 21 మందిపై ఎఫ్ఐఆర్
- రాడిసన్ హోటల్, కబాలి ప్రొడ్యూసర్ డ్రగ్స్ పార్టీల్లోనూ కస్టమర్లపై చార్జిషీట్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో నలుగురు సప్లయర్లు సహా మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో రెగ్యులర్గా కొకైన్ , ఇతర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కస్టమర్లలో ఓ డాక్టర్ సహా కస్టమర్లను ప్రోత్సహిస్తున్న 3 పబ్బులతోపాటు మొత్తం 21 మందిని నిందితులుగా చూపారు. కస్టమర్లు మాదకద్రవ్యాల బాధితులు కాదు.. నిందితులేనని కోర్టుకు వెల్లడించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయికి అలవాటు పడ్డ వారిలో మార్పు తెచ్చేందుకు పోలీసులు కొత్త ప్రయోగం చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్న కస్టమర్లపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. డ్రగ్స్ బాధితులుగా కాదు.. నిందితులుగా కోర్టులో హాజరుపరుస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు సహా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గతంలో నమోదు చేసిన చాలా కేసుల్లో సినీ నటులతోపాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని మాదక ద్రవ్యాల బానిసలు, బాధితులుగా మాత్రమే రికార్డుల్లో చూపారు.
డ్రగ్స్ కస్టమర్ల పేర్లు ఎఫ్ఐఆర్తోపాటు ఎక్కడ కూడా వెల్లడించే వారు కాదు. కానీ రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తిగా అరికట్టేందుకు సప్లయర్లతో కలిపి కస్టమర్లను కూడా కేసుల్లో నిందితులుగా చూపుతున్నారు. కస్టమర్ల వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మోతాదును బట్టి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. లేదా నోటీసులు ఇచ్చి వారిపై చార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిన నాటి నుంచి 15,847 కేసులు నమోదు చేయగా.. ఇందులో డ్రగ్స్, గంజాయి సప్లయర్లు సహా 32,546 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
గతంలో బాధితులు, సాక్షులు.. ఇప్పుడు నిందితులు..
గతంలో డ్రగ్స్, గంజాయి తీసుకుంటూ పట్టుబడిన వారిని పోలీసులు బాధితులు, సాక్షులుగా మాత్రమే చూపేవారు. డ్రగ్స్ సప్లయర్పై నేరాన్ని నిరూపించేందుకు వీరిని సాక్షులుగా వినియోగించేవారు. కానీ ప్రస్తుతం డ్రగ్స్, గంజాయి తీవ్రత పెరిగిపోవడంతో కట్టడి చేసేందుకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీఎస్) యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సాధారంగా డ్రగ్స్ సప్లయ్ చేసే వారిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తుంటారు.
డ్రగ్ సరఫరా చేస్తున్న వారితోపాటు డ్రగ్స్ను కొనుగోలు చేసి భద్రపరిచిన వారిని ప్రొత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మోతాదును పరిగణనలోకి తీసుకొని వివిధ సెక్షన్స్ కింద అభియోగాలు మోపుతారు. శాంపిల్స్ టెస్ట్ రిపోర్ట్ సహా డ్రగ్స్కు సంబంధించిన పూర్తి ఆధారాలను, క్యాష్ ట్రాన్సాక్షన్స్ను కోర్టుకు అందిస్తారు. సీజ్ చేసిన డ్రగ్స్ను కోర్టులో డిపాజిట్ చేస్తారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన సరఫరాదారులపై మాత్రమే కోర్టులో విచారణ జరుగుతుంది. మాదకద్రవ్యాల అమ్మకాల ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా కోర్టు జప్తు చేస్తుంది.
డ్రగ్స్ కస్టమర్లలో భయం పుడితేనే..
ఇలాంటి కేసుల్లో కేవలం డ్రగ్స్ సప్లయర్లపైనే యాక్షన్ తీసుకుంటుడంతో కస్లమర్లలో భయం లేకుండా పోయింది. దీంతో మళ్లీ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలా రిపీటెడ్గా పట్టుబడిన వారితోపాటు డ్రగ్స్ లేదా గంజాయి కొనుగోలు చేస్తూ మొదటిసారి దొరికినా.. ప్రస్తుతం నిందితులుగా చూపుతున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా.. డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నా.. సప్లయర్స్తో సంబంధాలు ఉన్నా.. వారు సమాజంలో తలదించుకునేలా మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సహా కబాలి ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ డ్రగ్స్ పార్టీలు, రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వారికి భయం కలిగేలా చేశారు. కేసుల్లో నిందితులుగా చేర్చి కోర్టులో హాజరుపరిచారు. ఇలాంటి పరిణామాలతో డ్రగ్స్ తీసుకునే వారిలో మార్పు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్న ప్రముఖ రాజకీయ నేత కుమారుడు, సినీ డైరెక్టర్, యూట్యూబర్లు సహా పార్టీలో పాల్గొన్న మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చారు. డ్రగ్స్ పార్టీలు నిర్వహించినందుకు హోటల్పై, డ్రగ్స్ తీసుకున్న కస్టమర్లపై కూడా చార్జిషీట్ దాఖలు చేశారు. ఇటీవలి కాలంలో నమోదైన పలు కేసుల్లోనూ కస్టమర్లను నిందితులుగానే కోర్టులో హాజరుపరిచారు.