బంగ్లాదేశ్ లో గత కొద్దిరోజులుగా సంక్షోభం కొనసాగుతోంది..బంగ్లాదేశ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మైనార్టీ వర్గాల పై దాడులు పెరిగాయి. దేశమంతా అశాంతి నెలకొంది. అయితే హాదీ హత్య వెనక తాత్కలిక ప్రభుత్వం కుట్ర ఉందని అతని సోదరుడు ఆరోపించడంతో బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ క్రమంలో తరీఖ్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత దేశంలోకి ఎంట్రీ ఇచ్చాుడు.. తాత్కాలిక ప్రభుత్వం అతనికి సాదర స్వాగతం పలికింది.. తరీఖ్ రెహమాన్ రాకతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయా?
ఎవరీ తరీఖ్ రెహమాన్.. ?
తరీఖ్ రెహామాన్..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కొడుకు. దేశం విడిచి విదేశాల్లో ఉంటున్న రెహమాన్ గురువారం (డిసెంబర్ 25) ఢాకాలో దిగాడు. దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చాడు. 2008లో అవినీతి, మాజీ ప్రధాని హసీనాపై హత్యాయత్నం నిందితుడు.. దేశం విడిచి వెళ్లిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్.
ఇటీవల కాలంలో రెహమాన్ కు అనుకూలంగా బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. రెహమాన్ ఎదుర్కొంటున్న అవినీతి, హత్యాయత్నం కేసుల్లో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు అతనికి క్లీన్ చిట్ ఇచ్చాయి. ప్రధాన కేసులన్నింటిలో అతడిని నిర్దోషి అని విడుదల చేశాయి. దీంతో రెహమాన్ రాకకు రాజకీయపరమైన అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. దీంతో బీఎన్ పీ ప్రధాన నేతగా 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉంటానని ఇటీవల ప్రకటించారు.
బంగ్లాదేశ్ లో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొన్న క్రమంలో రెహమాన్ తిరిగి స్వదేశానికి రావాలని నిర్ణయించకున్నట్లు బీఎన్ పీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది హసీనా ప్రధాని పదవి కోల్పోయి దేశ బహిష్కరణ కు గురయ్యారు. అనంతరం యూనిస్ ఖాన్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 2026లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, న్యాయపరమైన ప్రక్రియను రూపొందించేందుకు యూనిస్ ఖాన్ కు ఆ పదవిని ఇచ్చారు.
ఈ క్రమంలో రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్ పీ ప్రధాన ప్రత్యర్థి పార్టీగా రెహమాన్ నాయకత్వంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. మద్దతుదారులు రెహమాన్ ను ప్రధానమంత్రి అభ్యర్థిగా, ప్రతిపక్ష రాజకీయాలకు ఏకీకృత శక్తిగా ప్రమోట్ చేస్తున్నారు.
2024 లో హింసాత్మక తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా ప్రధాని పదవికోల్పోయి దేశం విడిచి వెళ్లిపోయింది. యూనిస్ ఖాన్ నేతృత్వంలో ఏర్పడి తాత్కాలిక ప్రభుత్వం.. షేక్ హసీనా పార్టీ అవామీ లిగ్ ను రద్దు చేసింది. ఆవామీ లీగ్ ను ఎన్నికల నుంచి నిషేధించడంతో రాజకీయ పార్టీల పొత్తులు విచ్ఛిన్నమయ్యాయి. బీఎన్ పీ, జామాత్ పార్టీలు విడిపోయాయి. జూలై నిరసనల తర్వాత విద్యార్థుల నాయకత్వంలో నేషనల్ సిటిజన్ పార్టీ ఆవిర్భవించింది.
80ఏళ్ల ఖలీదా జియా ఆనారోగ్యం సమస్యలతో పోరాడుతుండగా, రెండు దశాబ్దాల తర్వాత అవామీ లీగ్ లేకుండా తొలిసారి ఎన్నికల్లోకి అడుగుపెడుతున్న తారిఖ్ రెహమాన్ ను బీఎన్ పీ పార్టీ అత్యంత సమర్ధుడైన నాయకుడిగా భావిస్తోంది. రెహమాన్ ఎన్నికల్లోపోటీ చేయాలన్న నిర్ణయం.. పార్టీ ఐక్యతకు, జియా కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తిరిగి పొందేందుకు , బీఎన్ పీని పాలక పార్టీగా చూసేందుకు ఓ ప్రయత్నం గా సూచిస్తుంది. వచ్చే సారత్రిక ఎన్నికల్లో బీఎన్ పీ బలమైన పార్టీగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీ మెజార్టీ సాధిస్తే రెహమాన్ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది.
