హైదరాబాద్,వెలుగు: డ్రగ్స్ మాఫియా శంషాబాద్ ఎయిర్ పోర్టును అడ్డాగా చేసుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ తరహాలోనే ఆఫ్రికా దేశాలను నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు డ్రగ్స్ ను తీసుకొస్తున్న సప్లయర్స్ ఇక్కడి నుంచి గోవా, ముంబయి, బెంగళూర్, ఢిల్లీకి డ్రగ్స్ తరలిస్తున్నారు. షిప్ యార్డ్లో కస్టమ్స్, డీఆర్ఐ నిఘా పెరగడంతో వారం రోజులుగా డ్రగ్స్ మాఫియా శంషాబాద్ ఎయిర్పోర్ట్ను ట్రాన్స్పోర్ట్కు అనుకూలంగా చేసుకుంది. క్యారియర్ నెట్ వర్క్తో డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. డ్రగ్స్ను క్యాప్సూల్స్ పెట్టి వాటిని మింగి కడుపులో దాచి తీసుకొస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి హెరాయిన్, కొకైన్ స్మగ్లింగ్పై అందిన సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఎయిర్పోర్ట్లో నిఘా పెట్టింది. డ్రగ్స్ బేస్ అనాలసిస్,ఇంటెలిజెన్స్ వింగ్స్ ఇచ్చిన సమాచారంతో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు ప్యాసింజర్ల నుంచి 3.129 కిలోల హెరాయిన్, 1,157 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకుంది.డ్రగ్స్ క్యారియర్స్ను అదుపులోకి తీసుకుని విచారించింది.
కడుపులో 79 కొకైన్ క్యాప్సూల్స్
టాంజానియాకు చెందిన ఓ డ్రగ్స్ స్మగ్లర్ (44) ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా నెట్వర్క్లోని గోవా, ముంబయి, బెంగళూర్, చెన్నైకి కొకైన్,హెరాయిన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. వారం రోజులుగా సీపోర్ట్లోని షిప్ యార్డ్స్లో డీఆర్ఐ, ఎన్సీబీ అధికారుల దాడులు పెరగడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మీదుగా దేశంలోని డ్రగ్స్ డీలర్స్కి సప్లయ్ చేసేందుకు స్కెచ్ చేశాడు. నార్త్ ఆఫ్రికాలోని ప్రిటోరియాకు వెళ్లి కొకైన్ తీసుకున్నాడు. 79 క్యాప్యూల్స్ లో కొకైన్ ను పెట్టి వాటిని మింగి కడుపులో దాచుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరిన తర్వాత 34 రోజుల్లోగా డీలర్స్కి అందించేలా ప్లాన్ చేసుకున్నాడు. టాంజానియా నుంచి జోహన్నెస్ బర్గ్ చేరుకుని దుబాయి మీదుగా ఈ నెల 21న శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చాడు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో డీఆర్ఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కడుపులో కొకైన్ క్యాప్సూల్స్ ను గుర్తించి హాస్పిటల్కి తరలించారు. అదే రోజు 22 క్యాప్సూల్స్ ను బయటికి తీయించారు. ఐదు రోజుల తర్వా మంగళవారం మరో 57
క్యాప్సూల్స్ను బయటికి తీయించారు. అతడి నుంచి వివరాలు రాబట్టారు. మొత్తం 79 క్యాప్యూల్స్ను స్వాధీనం చేసుకున్న అధికారులు వీటి విలువ రూ.11 కోట్ల 57 లక్షలు ఉంటుందని గుర్తించారు.