
రంగారెడ్డి జిల్లా: రైలు పట్టాలపై కారు నడుపుతూ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలో ఒక యువతి నానా రచ్చ చేసింది. నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్ చేయడాన్ని స్థానికులు గమనించారు.
నాగులపల్లిలో స్థానికులు గమనించి కారును అడ్డుకున్నప్పటికీ పట్టాలపై వేగంగా కారు నడుపుతూ ఆ యువతి ఎవరి మాట వినకుండా మొండికేసింది. అదే సమయంలో ఎదురుగా రైలొచ్చింది. ట్రైన్ లోకో పైలెట్ పట్టాలపై కారు వస్తుండటాన్ని గమనించి అలర్ట్ అయి ట్రైన్ ను నిలిపివేశాడు. దీంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది.
ఈ యువతి చేసిన ఈ పైత్యపు పని వల్ల పట్టాలపై మార్గమధ్యంలోనే పలు రైళ్లు ఆగిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. సమాచారం అందుకున్న శంకరపల్లి పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి ఎవరు..? ఎందుకిలా చేసింది..? మద్యం మత్తులో ఉందా..? ఈ కోణాల్లో పోలీసులు ఆ యువతిని విచారిస్తున్నారు.