రజకులపై నోరు జారిన ఎమ్మెల్యే.. సోషల్​మీడియాలో వీడియోలు వైరల్​

రజకులపై నోరు జారిన ఎమ్మెల్యే.. సోషల్​మీడియాలో వీడియోలు వైరల్​

దుబ్బాక, వెలుగు : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​రెడ్డి రజకులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శుక్రవారం దుబ్బాకలో జరిగిన మెదక్​ లోక్​సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు చదువుకున్నా.. ఆయన కంటే చదువురాని సాకలోళ్లు నయం’ అని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో క్లిప్పింగులు సోషల్​మీడియాలో వైరల్​గా మారడంతో ఆయనపై ఇంట, బయట దుమారం రేగుతోంది. దీంతో ఎమ్మెల్యే దిద్దుబాటు చర్యలకు దిగారు.  

తనకు రజకులపట్ల అపార గౌరవం ఉందని,  వారి అభ్యున్నతికి గత బీఆర్ఎస్​ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను అమలు చేసిందని, చాకలి ఐలమ్మ విగ్రహాలు ఊరూరా ఏర్పాటుచేశామన్నారు. అనాదిగా వస్తున్న సామెతను మాత్రమే తాను చెప్పాను తప్ప తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.