
- టీఎస్ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దుబ్బాక యాదయ్య
ముషీరాబాద్, వెలుగు : గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంతో ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తోనే మళ్ళీ అభివృద్ధి చెందుతుందని టీఎస్ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దుబ్బాక యాదయ్య పేర్కొన్నారు. సోమవారం అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ని హైదరాబాదులోని తమ నివాసరంలో అసోసియేషన్ ప్రతినిధులు కలిసి ఘనంగా సన్మానించారు.
అనంతరం దుబ్బాక యాదయ్య మాట్లాడుతూ ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేసిన ఘనత కేసీఆర్దే అని ఎద్దేవా చేశారు. వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి వరించాలని కాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. పద్మారావు, వల్లూరి బాబు, రవీందర్, నాగ శేషు పాల్గొన్నారు.
కార్పొరేషన్ చైర్మన్ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల నియామకల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలిండియా కాన్ఫిడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే. మహేశ్వర్ రాజ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దీని కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు సోమవారం ఆర్గనైజేషన్ ప్రతినిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు వివేక్ వెంకటస్వామి కలిసి శుభాకాంక్షలు తెలిపి ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు జేబీ రాజు, సత్యం, నర్సింగరావు, కిషోర్ కుమార్, హనుమంతరావు, లావణ్య, రాణి, వెంకట్ రాజు తదితరులు పాల్గొన్నారు.