పాడె మోసి.. బస్వాపురం నిర్వాసితుల నిరసన

పాడె మోసి.. బస్వాపురం నిర్వాసితుల నిరసన

యాదాద్రి, వెలుగు : మూడేండ్లుగా ఎదురు చూస్తున్నా పరిహారం రాకపోవడంతో బస్వాపురం నిర్వాసితులు లీడర్ల ఫోటోలు అతికించిన పాడెను మోసి నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాలో నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్​ కారణంగా బీఎన్​ తిమ్మాపురం గ్రామం మునిగిపోతోంది. మూడేండ్ల కింద ప్రకటించిన అవార్డ్​ప్రకారం ఇప్పటివరకు పరిహారం ఇవ్వపోవడంతో 23 రోజులుగా బీఎన్​ తిమ్మాపురం వాసులు  రిజర్వాయర్​ కట్టపై ఆందోళన చేస్తున్నారు. నిరసనలతో భాగంగా ఇటీవల సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి జిల్లా కలెక్టర్​ పమేలా సత్పతి, అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో భూపాల్​రెడ్డిని కలిసి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

అడిషనల్​కలెక్టర్​నిర్వాసితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. కలెక్టర్​వచ్చి హామీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్​చేశారు. కానీ కలెక్టర్​మాత్రం నిర్వాసితుల వద్దకు వెళ్లలేదు. దీంతో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బుధవారం బస్వాపురం రిజర్వాయర్​ కట్టమీద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి ఫోటోలు దిష్టిబొమ్మపై అతికించి దానిని పాడెపై పెట్టి మోశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. దిష్టిబొమ్మ దహనంలో కొందరు టీఆర్ఎస్​లీడర్లు సైతం పాల్గొనడం గమనార్హం.