గోదావరిలో వరద ఉధృతి

గోదావరిలో వరద ఉధృతి

వారం రోజులుగా కురిసిన వర్షాలకు  గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో  ములుగు జిల్లా రామన్న గూడెం పుష్కర ఘాట్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ప్రస్తుత నీటి మట్టం 17.460 మీటర్లు  ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

ప్రధాన రహదారిపై  వరద నీరు..
పెద్దపల్లి జిల్లాలో  గోదావరి నది  ఉద్ధృతంగా  ప్రవహిస్తుంది. గోదావరిఖని-  మంచిర్యాల దారిలోని  బ్రిడ్జి పై  వరద చేరింది. గోదావరిఖని  గంగానగర్  దగ్గర  ప్రధాన రహదారిపై  వరద నీరు ప్రవహిస్తుంది.  నది ప్రవాహాన్ని గంగానగర్  ప్రాంతాన్ని మాజీ  ఎంపీ, బీజేపీ  జాతీయ కార్యవర్గ  సభ్యులు  వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. మరోవైపు మంచిర్యాల- గోదావరిఖని మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి.  గంగానగర్ లో  చెక్ పోస్టు  ఏర్పాటు చేసి.... బస్టాండ్  సమీపంలోనే వాహనాలు నిలిపివేస్తున్నారు అధికారులు.  

గౌతమేశ్వర ఆలయం  చుట్టూ  వరద నీరు..  
పెద్దపల్లి జిల్లా  మంథని గోదావరి నది  ఒడ్డున  ఉన్న గౌతమేశ్వర ఆలయం  చుట్టూ ...భారీగా  వరద నీరు  చేరింది. దీంతో.. గుడి దగ్గరున్న 20 మంది  వరదల్లో చిక్కుకున్నారు.  పూజారుల కుటుంబ సభ్యులు  17మంది, మరో  ముగ్గురు చేపల  వేటగాళ్లు  సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.  తమను సురక్షిత  ప్రాంతాలకు  తరలించాలని కోరుతున్నారు.

ములుగు జిల్లాలో నీటమునిగిన ఇళ్లు..
ములుగు జిల్లా  ఏటూరు నాగారంలో  గోదావరి ఉద్ధృతంగా  ప్రవహిస్తుంది.  నాగులమ్మ  వీధిలోకి  భారీ వరద చేరింది.  పలు ఇళ్లు నీట  మునిగాయి. ఇళ్లలోకి  నీరు చేరడంతో.. కాలనీవాసులు  ఆందోళన చెందుతున్నారు.  డ్రైనేజీ  పొంగిపొర్లుతుంది. వరద పోయేందుకు  చర్యలు చేపట్టాలని  అధికారులను  గ్రామస్థులు కోరారు. 

కుమురం భీం జిల్లా కౌటల మండలంలో  ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ లోని పెన్ గంగానదికి మహారాష్ట్ర నుంచి వరద ప్రవహిస్తోంది. చెనాక-కోరాట బ్యారేజ్ దగ్గర పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక లక్ష 91 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు.