అప్పుల బాధతో కుటుంబసభ్యులతో లొల్లి ..ఇంటిపై పెట్రోల్​పోసి నిప్పంటించిన వ్యక్తి

అప్పుల బాధతో కుటుంబసభ్యులతో లొల్లి ..ఇంటిపై పెట్రోల్​పోసి నిప్పంటించిన వ్యక్తి
  •      వరంగల్​ జిల్లా నాగారంలో ఘటన 

నెక్కొండ, వెలుగు : వరంగల్​ జిల్లా నెక్కొండ మండలం నాగారంలో ఆదివారం అప్పుల బాధతో కుటుంబసభ్యులతో గొడవపడిన ఓ వ్యక్తి తన ఇంటికే నిప్పు పెట్టాడు. గ్రామస్తుల కథనం ప్రకారం..నాగారానికి చెందిన కుమ్మరి మధు తన కుటుంబసభ్యులతో ఐదేండ్ల కింద హైదరాబాద్ వెళ్లి పెట్రోలు బంక్​లో పని చేస్తున్నాడు. అక్కడ అవసరాల కోసం రూ.లక్ష 50వేలకు పైగా అప్పు చేశాడు. ఆ అప్పులు తీర్చడం కోసం డబ్బులు ఇవ్వాలంటూ కొద్ది రోజులుగా తల్లిదండ్రులైన వెంకన్న, ఐలమ్మ, భార్య స్వప్నతో గొడవ పడుతున్నాడు. 

ఈ నెల23న ఫంక్షన్​కోసం హైదరాబాద్​ నుంచి మహబూబాబాద్ ​జిల్లా కంబాలపల్లికి వెళ్లి రాత్రి తన స్వగ్రామమైన నాగారం వచ్చాడు. తెల్లావారుజామున ఇంటిపై పెట్రోల్​చల్లి నిప్పంటించాడు. దీంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోగా సుమారు. రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగింది.  ఎస్సై మహేందర్​ విచారణ జరిపి మధును అదుపులోకి తీసుకున్నారు.