చెన్నై: దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి జరిగే ఈ పోరులో సౌత్ జోన్.. ఈస్ట్ జోన్తో తలపడనుంది. సౌత్ కెప్టెన్ తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్, వైభవ్ సూర్యవంశీ, దేవదత్ పడిక్కల్ రెడ్బాల్ ఫార్మాట్ విజయాలను మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నారు. లంకతో జరిగిన రెండు టెస్ట్ల్లో పడిక్కల్ రెండు సెంచరీలు బాది సూపర్ ఫామ్లో ఉన్నాడు. తిలక్, సూర్యవంశీ రెడ్ బాల్ క్రికెట్ ప్రణాళికల్లో లేరు. అయితే నార్త్ జోన్తో జరిగిన సెమీస్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన తిలక్ టెస్ట్ ఫార్మాట్లో తనను పరిగణనలోకి తీసుకోవాలని సంకేతాలు పంపిస్తున్నాడు.
ఈస్ట్ జోన్కు చెందిన సూర్యవంశీ సెంట్రల్తో జరిగిన సెమీస్లో 92, 40 రన్స్ చేశాడు. గాయపడిన పేసర్ విద్వత్ కావేరప్ప ప్లేస్లో రానున్న సిరాజ్.. న్యూజిలాండ్ టూర్కు ముందు అత్యుత్తమ ఫామ్ను అందుకోవాల్సి ఉంది. ఈస్ట్ కెప్టెన్ ఇషాన్.. అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు గాడిలో పడాలని యోచిస్తున్నాడు. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్తో పాటు స్పిన్నర్ అనుకూల్ రాయ్ ఈస్ట్ బౌలింగ్ దళంలో ఉన్నారు. షమీ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 100వ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఫస్ట్ క్లాస్, లిస్ట్–ఎ, టీ20ల్లో కలిపి 903 వికెట్లు తీసిన షమీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాడు.
