
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’లో హీరోయిన్గా నటించింది బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలవుతున్న సందర్భంగా కాసేపు ఇలా ముచ్చటించింది.
‘నా మొదటి మూవీ ‘లవ్ సోనియా’ రిలీజయ్యాక నాకు కాస్త గ్యాప్ వచ్చింది. ఖాళీగా ఉండటం ఎందుకని ‘కుంకుమభాగ్య’ సీరియల్లో నటించా. అది ఇతర భాషలతో పాటు తెలుగులోకీ డబ్ అయ్యింది. ఇప్పుడిలా తెలుగు సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద బ్యానర్లో, అదీ దుల్కర్తో కలిసి నటిస్తానని అనుకోలేదు. ‘జెర్సీ’ హిందీ రీమేక్ షూటింగ్ ఛండీగడ్లో జరుగుతున్నప్పుడు నాకీ ఆఫర్ వచ్చింది. నేరేషన్ వినగానే ఎక్సయిటయ్యి ఓకే చెప్పేశాను. ఓసారి మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్లో నాగ్ అశ్విన్ గారిని కలిశాను. ఆ పరిచయంతోనే ఇప్పుడీ సినిమాలో భాగమయ్యాను. ఇలాంటి పాత్ర చేయాలని ఏ నటి అయినా కోరుకుంటుంది. అది నాకు దొరకడం నా అదృష్టం.
నా పాత్రలో ఐదు షేడ్స్ వుంటాయి. కెరీర్లో అరుదుగా ఇలాంటి చాన్స్ దొరుకుతుంది. నాకు కథక్ అంటే ఇష్టం. ఇందులో దానికి స్కోప్ ఉంది. కొరియోగ్రాఫర్ బృందగారు చాలా ఎక్స్ప్రెషన్స్ చూపించారు. దుల్కర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్తో నటించడం హ్యాపీ. రష్మికలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ. ఒకరోజు ముంబై, మరో రోజు చెన్నై, ఆ తర్వాత ఫారిన్ అంటూ చలాకీగా తిరుగుతుంది.సెట్లో చాలా హుషారుగా వుంటుంది. అందరి విషయంలోనూ కేరింగ్గా ఉంటుంది. మా కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. హనుగారు ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. సినిమాకి మ్యూజిక్ మరో హైలైట్. ప్రస్తుతం బాలీవుడ్లో ‘పీపా’ అనే మూవీ చేస్తున్నాను. ఇండియా, బంగ్లాదేశ్ వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఆదిత్య రాయ్ కపూర్ తో ‘పూజామేరీ జాన్’ మూవీ కంప్లీట్ చేశాను. ఈ ట్రైలర్ చూశాక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ చాలా అవకాశాలు వస్తున్నాయి. కథలు వింటున్నాను. చాలెంజింగ్ రోల్స్ దొరికితే తప్పకుండా చేస్తాను.’’