బీసీల ఓట్లు కాంగ్రెస్​కు బలమవ్వాలి : దుండ్ర కుమారస్వామి

బీసీల ఓట్లు కాంగ్రెస్​కు బలమవ్వాలి :  దుండ్ర కుమారస్వామి

బషీర్ బాగ్, వెలుగు: కాంగ్రెస్​తోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్​రెడ్డి అమలుచేసుకుంటూ పోతున్నారన్నారు. అలాంటి పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బీసీలు అండగా నిలవాలని, బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్​కు బలంగా మారాలని పిలుపునిచ్చారు. కాచిగూడలోని సంఘం ఆఫీసులో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

దేశ సంపద అన్ని వర్గాలకు న్యాయబద్ధంగా అందాలంటే కులగణన చేపట్టాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. బీజేపీకి బీసీలను ఓట్లు అడిగే హక్కు లేదని, బీసీ సంఘాల మద్దతు కాంగ్రెస్ కు ఉందని చెప్పారు. బీసీలను విస్మరిస్తున్న బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ముదిరాజ్ కుల సంఘం ఉపాధ్యక్షుడు గాంధీ నారాయణ, మున్నూరు కాపు సంఘం కార్యదర్శి జ్వాల సత్యనారాయణ, మహేంద్రబాబు, వెంకటరమణ, రాజేశ్​యాదవ్, సాయి, చరణ్, తదితరులు పాల్గొన్నారు.