- తెలంగాణ అన్బీటబుల్
- ప్రపంచ దేశాలకే మోడల్గా నిలవాలని ఆకాంక్ష
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అన్స్టాపబుల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, తెలంగాణ అన్బీటబుల్ అని తాను అంటున్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ మోడల్ ఆధారంగా ముందుకు వెళ్తున్నట్టు సీఎం చెప్పారని, ఇది గొప్ప విషయమని ప్రశంసించారు. ‘‘2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అంటే ఏటా 8 నుంచి 9 శాతం వృద్ధి సాధించాలి. ఇదొక చాలెంజ్.. కొంచెం కష్టమే అయినా సాధ్యమే. ఇలాంటి లక్ష్యం పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు” అని పేర్కొన్నారు. గ్లోబల్ సమిట్లో భాగంగా మంగళవారం విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడారు.
హైదరాబాద్ అద్భుతమైన నగరమని ఆయన కొనియాడారు. ‘‘ఒకప్పుడు తెలంగాణ పేదరికంతో వెనుకబడి ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలో గణనీయంగా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. 20 ఏండ్ల కింద ప్రజలందరూ బెంగళూరుకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అందరూ హైదరాబాద్ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుని ఇక్కడే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారు. దీన్ని బట్టి తెలంగాణ గొప్పతనం ఏంటో అర్థమవుతున్నది” అని అన్నారు.
ప్రపంచ దేశాలకే మోడల్గా నిలవాలి..
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను ఐఎస్బీ, నీతి ఆయోగ్ సంస్థలకు చెందిన మేధావులతో రూపొందించడం అభినందనీయమని సుబ్బారావు అన్నారు. సలహా మండలి సభ్యుడిగా ఈ డాక్యుమెంట్ అమలుకు తన వంతు కృషి చేస్తానన్నారు. “హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, జీసీసీల్లో అభివృద్ధి సాధించింది.
తయారీ రంగం, వ్యవసాయ రంగం, ఇతర ఉపాధి రంగాలు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి” అని సూచించారు. వచ్చే పదేండ్లలో రాష్ట్రం ప్రపంచ దేశాలకే మోడల్గా నిలవాలని ఆకాంక్షించారు.

