ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రపంచ స్థాయికి ఎదగాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జనవరి 1 న సాయంత్రం హైదరాబాద్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత పాలకులు ఎగ్జిబిషన్ సొసైటీని ప్రోత్సహిస్తామని అనేక హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సొసైటీ ప్రెసిడెంట్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సొసైటీని పెద్ద ఎత్తున విస్తరింపజేసి ఆదాయం సృష్టించుకుని, ఎగ్జిబిషన్ సొసైటీ ఆలోచనలను సఫలీకృతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారని వివరించారు. నుమాయిష్ హైదరాబాద్ నగరానికే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ఉత్సవం అని అన్నారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనతో ఉస్మానియా పట్టభద్రులు పబ్లిక్ గార్డెన్స్ లో మొదట 1938లో ఎగ్జిబిషన్స్ సొసైటీని ప్రారంభించారని వివరించారు.
గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ను అత్యంత సేఫ్ నగరంగా రూపొందించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. కాలుష్యరహితంగా, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా, పూర్తి శాంతి భద్రతలతో కూడిన నగరంగా హైదరాబాదును రూపొందించే ఆలోచనలో ప్రజా ప్రభుత్వం ఉందని తెలిపారు అందులో సొసైటీ సభ్యులు భాగం కావాలని విజ్ఞప్తి చేశారు. లండన్ లోని థీమ్స్ ఉన్నది అభివృద్ధి ద్వారా పరిసర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయో అదేవిధంగా మూసి నదిలో మంచినీరు ప్రవహింపచేసి పునర్జీవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని, మూసి పరిసర ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు.
వాతావరణ కాలుష్యం మూలంగా ఢిల్లీ నగరంలో వారం రోజులు ఉండే పరిస్థితి లేదు ఆ పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. రాక్స్, లేక్స్ , పార్కులతో కూడిన నగరం హైదరాబాద్ ఇవి భవిష్యత్తు తరాలకు భద్రంగా అందించాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. నగరంలోని డీజిల్ బస్సులను దశలవారీగా బయటకు పంపి బ్యాటరీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ప్లాస్టిక్ రహిత నగరంగా హైదరాబాదును మార్చుతామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. నగరం లోపల ఉన్న కాలుష్య కారకమైన ఇండస్ట్రియల్ పార్కులను అవుటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు.
