హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్‌.. 14 మంది ఐటీ ఉద్యోగులు అరెస్ట్..

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్‌..  14 మంది ఐటీ ఉద్యోగులు అరెస్ట్..

డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది ‘ఈగల్‘ టీమ్. హైదరాబాద్ లో ఎక్కడ మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా మెరుపు దాడి చేసి పట్టుకుంటోంది. అందులో భాగంగా ఆదివారం (జులై 13) గచ్చిబౌలిలో గంజాయి, డ్రగ్స్ వినియోగం జరుగుతోందనే సమాచారంతో నిఘా వేసి దాడులు చేసింది. డెకాయ్ ఆపరేషన్‌ చేపట్టి 14 మంది డ్రగ్స్ వినియోగదారులను అరెస్ట్ చేసింది. 

ఆదివారం మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు ఈగల్ టీమ్ పోలీసులు. పక్కా సమాచారంతో గచ్చిబౌలి లోని HDFC బ్యాంక్ సమీపంలో ఈ ఆపరేషన్ నిర్వహించి పట్టుకుంది. పట్టుబడిన వారిలో ఆన్‌లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, బిజినెస్ మేనేజర్లు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో అందరూ గంజాయి సేవించినట్లు నిర్ధారించి.. 
పట్టుబడిన 14 మందిని డ్రగ్ డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి చికిత్స అందించనున్నారు. 

వాట్సాప్ కోడ్‌‌తో డెకాయ్ ఆపరేషన్:

ఇటీవల మహారాష్ట్ర నుంచి వచ్చి గంజాయి సరఫరా చేస్తున్న సందీప్ అనే ఈగల్ టీమ్ (Eagle Team) అరెస్ట్ చేసింది. అతని ఫోన్‌ కాంటాక్ట్ లిస్ట్ ద్వారా ఈ డెకాయ్ ఆపరేషన్ చేసింది ఈగల్. గంజాయి వచ్చిందంటూ కస్టమర్లకు పోలీసులు మెసేజ్ పెట్టారు. ‘భాయ్ బచ్చా ఆగయా భాయ్’ అనే వాట్సాప్ కోడ్‌‌తో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కోడ్ పంపి గచ్చిబౌలిలోని HDFC బ్యాంక్ దగ్గరలోని ఒక చోటుకి రావాలని ఈగల్ టీమ్ పేర్కొంది. దీంతో రెండు గంటల్లో 14 మంది వినియోగదారులు లొకేషన్‌కి వచ్చారు. వాళ్లందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐటి ఉద్యోగులు, రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఆన్‌లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్లు ఉన్నారు. 

గంజాయి కొనేందుకు భార్య, నాలుగేళ్ల కుమారుడితో..

గంజాయి కొనేందుకు ఓ వ్యక్తి  భార్య, నాలుగేళ్ల కుమారుడితో రావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.  అయితే ఈ 14 మందికి నిర్వహించిన యూరిన్ టెస్ట్‌లో అందరూ డ్రగ్ పాజిటివ్ అని తేలింది. 14 మందిని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు. నిందితుడు సందీప్ మహారాష్ట్ర నుంచి గంజాయి తెప్పిస్తున్నట్లు గుర్తించారు. 

సందీప్ తెప్పిస్తున్న ప్యాకెట్లను 50 గ్రాముల చొప్పున తయారు చేసి.. కస్టమర్లకు అందిస్తుంటాడు. ఆ విధంగా 100 గంజాయి ప్యాకెట్లు తెప్పిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒక్కో ప్యాకెట్‌ని రూ.3 వేలకు సందీప్ అమ్ముతున్నాడు. సందీప్ వద్ద 100 మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. సందీప్ వెనకాల ఉన్న ముఠాను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.