
- ఈబీసీ సంక్షేమ సంఘం
హైదరాబాద్, వెలుగు: అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రవీందర్ రెడ్డి నేతృత్వంలో ఈబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి బృందం సోమవారం రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... అగ్రకులాల్లో 90శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని తెలిపారు.
వారి సంక్షేమం కోసం బడ్జెట్ లో రూ. 10వేల కోట్లు కేటాయించి, ఈబీసీ కార్పొరేషన్, కమిషన్, వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతినిధి బృందంలో తెలంగాణ కమ్మ సేవా సమితి అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ రావు, కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్ధన్, అఖిల భారత వెలమ సంఘం ఉపాధ్యక్షుడు నీలగిరి దయాకర్ రావు ఉన్నారు.